రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సరఫరా చేసిన సామగ్రిలో ఇలా తేడాలు ఉన్న స్వస్తిక్ ముద్రలు వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లా కడియంలో, విజయనగరం జిల్లా సీతానగరంలో వీటిని అధికారులు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వాటిని వెనక్కి పంపిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒకటి చొప్పున స్వస్తిక్ గుర్తులతో ముద్రలు ఉండే కర్ర పిడిని అందిస్తారు. ఇవి అపసవ్య దిశలో ఉండేలా తయారు చేయాలి. దీన్ని ఇంకులో ముంచి బ్యాలెట్ పత్రంలో నచ్చిన గుర్తుపై ఓటు వేయాలి. అప్పుడు అది ఓటు పత్రంపై సవ్య దిశలో ముద్రితమవుతుంది. ప్రస్తుతం పంపిణీ చేసినవి దీనికి విరుద్ధంగా ఉన్నాయి. పత్రంపై ముద్రించే సరికి అవి అపసవ్య దిశలో ముద్రితమవుతున్నాయి. వీటి స్థానే కొత్తవాటిని తెప్పిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ అధికారి ఎస్.వి.నాగేశ్వర్ నాయక్ చెప్పారు.
ఇదీ చదవండి