ఒప్పంద ప్రాతిపదికన బోధనకు ఉపాధ్యాయ అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. డీఎస్సీ- 2008లో అర్హత సాధించినా ఉద్యోగాలు దక్కనివారిని ఒప్పంద ప్రాతిపదికన సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టుల్లో నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. గడువు ముగిసే సరికి జిల్లాలో 51 శాతం మంది మాత్రమే ఆసక్తి చూపారు. అప్పటి 100 శాతం కామన్ మెరిట్ జాబితా ద్వారా అదనంగా ఎంపిక చేసిన సెకండరీ గ్రేడ్ అభ్యర్థుల పోస్టులు తూర్పు గోదావరి జిల్లాకు 502 కేటాయించారు. ఇందులో బీఈడీ 497, డీఈడీ అయిదు పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఈ అభ్యర్థుల జాబితాను విద్యా శాఖ అంతర్జాలంలో పొందుపరిచింది. అభ్యర్థులు తమ అంగీకార పత్రాలను ఈనెల 17లోగా deoeg@apschooledu.inకు పంపాలని కోరింది. ఆశించిన స్పందన రాకపోవడంతో మరో మూడు రోజులు అవకాశం ఇచ్చారు. చివరి రోజైన బుధవారం నాటికి జిల్లాలో 502 పోస్టులకు 260 మంది మాత్రమే దరఖాస్తు చేశారని జిల్లా విద్యా శాఖ అధికారి ఎస్.అబ్రహం తెలిపారు.
ఆసక్తి ఉంటే మెయిల్ చేయండి
ఈరోజు సాయంత్రం తుది జాబితాను ప్రభుత్వానికి పంపుతామని, ఈలోగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు హాల్టికెట్, మార్కుల జాబితా, అంగీకార పత్రాన్ని స్కాన్ చేసి మెయిల్ చేయవచ్చని సూచించారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత అధికంగా ఉంది. గత విద్యా సంవత్సరంలో ఏకంగా 32 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. జిల్లాలో విద్యార్థులకు సమర్థ బోధన సాగాలంటే 1,200 మంది ఉపాధ్యాయులు అవసరమని పేర్కొంటూ ప్రతిపాదనలను విద్యా శాఖ అధికారులు ఇటీవల ప్రభుత్వానికి పంపారు. తాజాగా ఒప్పంద ఎస్జీటీ పోస్టులు 502తో పాటు 2018 డీఎస్సీ ద్వారా 620 పోస్టులు భర్తీ అయితే కొంత వెసులుబాటు ఉంటుందని యంత్రాంగం భావిస్తోంది.
ఇదీ చదవండి: అగ్నిప్రమాద బాధితులకు తెదేపా నాయకుల చేయూత