ఆడి కృత్తిక పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ విజ్ఞానగిరి పై వెలసిన శ్రీ వల్లి దేవి సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఆలయంలో ఏకాంతంగా పూజలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి భక్తులకు అనుమతి లేదని ముందస్తుగా సమాచారం ఇచ్చారు.
అయినప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో విజ్ఞాన గిరికి హాజరయ్యారు. కొండపైకి అనుమతి లేదంటూ ఆలయ సిబ్బంది అడ్డుకోవడంతో కొండ కిందనే మొక్కులు చెల్లించుకున్నారు. నారద పుష్కరణి వద్ద తలనీలాలు సమర్పిస్తున్నారు. అయితే అవసరమైన నీటి సదుపాయాలు లేకపోవడంతో వాటర్ బాటిల్ కొనుగోలు చేసి కొద్దిపాటి నీటితో రోడ్డుపై నామమాత్రంగా స్నానాలు చేస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఆలయంలో ఏ కాంతంగా పూజలు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ముందస్తుగా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టకపోవడంతోనే సమాచారం లేక శ్రీకాళహస్తికి చేరుకుని అవస్థలు పడుతున్నామని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.