అనంతపురం జిల్లాలో నిత్యం ప్రయాణికుల రద్దీతో ఉండే మైసూర్ -హుబ్బళ్లి (06581/82) హంపీ ఎక్స్ప్రెస్ రైలును అనంతపురంలో నిలుపుదల (స్టాపేజీ)ను రద్దు చేశారు. జిల్లా కేంద్రానికి చెందిన ప్రయాణికులు బళ్లారి, హొసపేటె, కొప్పల్, గదగ్ మీదుగా హుబ్బళ్లికి వెళ్లే రైలు ఒకే ఒక్కటి ఉంది. అదే హంపీ ఎక్స్ప్రెస్ రైలు. ఇతర రైళ్లు గుంతకల్లు నుంచి రాయచూర్, సోలాపూర్ మీదుగా వెళ్తాయి. బళ్లారి, హొసపేటే, గదగ్, హుబ్బళ్లి వైపు వెళ్లే ప్రయాణికులు అత్యధికంగా ఉంటున్నారు. ఈ రైలు 30 ఏళ్లుగా అనంతపురంలో ఆగుతుంది. ఇదిలా ఉండగా ఈ నెల 11వ తేదీ నుంచి జిల్లా కేంద్రంలో స్టాపేజీ రద్దు చేశారు. అదేంటని ప్రశ్నిస్తే ప్రయాణికుల సంఖ్య తగ్గిందని చెబుతున్నారు. కరోనా వైరస్ ఉండటంతో అన్ని రైళ్లలోనూ రద్దీ తగ్గుముఖం పట్టింది. హంపి ఎక్స్ప్రెస్ జిల్లాలోని హిందూపురం, పెనుకొండ, ధర్మవరం, గుంతకల్లులో ఆపుతున్నారు. జిల్లాలో నాలుగు పట్టణాల్లో ఆగుతున్న రైలు జిల్లా కేంద్రంలో ఆపకుండా నడపటం విడ్డూరంగా ఉందని రైలు ప్రయాణికులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. అనంతపురం స్టాపేజీ తొలగించడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్తా..
మైసూర్-హుబ్బళ్లి (హంపి ఎక్స్ప్రెస్) అనంతపురంలో స్టాపేజీ రద్దు చేయడంపై అనంతపురం పార్లమెంటు సభ్యులు రంగయ్య స్పందిస్తూ.. ఈ విషయాన్ని రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్తానన్నారు. బళ్లారి, హొసపేటె, హుబ్బళ్లి వైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ రైలును అనంతపురంలో నిలుపుదల చేసేలా కృషి చేస్తానన్నారు.
ఇవీ చూడండి…