Israeli Palestinian conflict: పాలస్తీనా పశ్చిమ ప్రాంతంలోని జెనిన్ నగరంపై ఇజ్రాయెల్ చేపట్టిన దాడిని కవర్ చేసేందుకు వెళ్లిన ఆల్-జజీరా జర్నలిస్ట్ను కాల్చి చంపినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. దాడి ప్రారంభమైన కొద్దిసేపటికే అరబిక్ ఛానల్ రిపోర్టర్ షిరీన్ అబు ఆక్లే మృతి చెందినట్లు వెల్లడించింది. జరుసలేంకు చెందిన అల్ క్వాడ్స్ వార్తాపత్రికలో పని చేస్తున్న పాలస్తీనా జర్నలిస్ట్ సైతం గాయపడ్డారని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొంది. ఇజ్రాయెల్ చేసిన దాడిలోనే జర్నలిస్టులకు తూటాలు తగిలాయని తెలిపింది. వారు ధరించిన దుస్తులపై స్పష్టంగా ప్రెస్ అని రాసి ఉన్నట్లు పేర్కొంది.
మరోవైపు.. జెనిన్లో ఉన్న తమ బలగాలపై తుటాలు, బాంబులతో విరుచుకుపడ్డారని.. అందుకే తాము ఎదురుదాడి చేసినట్లు పేర్కొంది ఇజ్రాయెల్ మిలిటరీ. జర్నలిస్ట్ మృతిపై దర్యాప్తు చేపడతామని, పాలస్తీనా సైనికుడే వారిపై కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నామని పేర్కొంది.
కొద్ది వారాలుగా ఆక్రమిత వెస్ట్బ్యాంక్ ప్రాంతంలో ప్రతిరోజు దాడులు చేస్తోంది ఇజ్రాయెల్. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్లో అంతర్గత దాడులు జరుగుతుండటం గమనార్హం. చాలా వరకు దాడులు పాలస్తీనీయన్లు చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంటోంది. శరణార్థుల క్యాంప్గా మారిన జెనిన్ నగరాన్ని మిలిటరీ స్థావరంగా మార్చుకుంది ఇజ్రాయెల్. 1967లో వెస్ట్బ్యాంక్ ప్రాంతాన్ని ఆక్రమించింది.
ఇదీ చూడండి: Israel palestine clashes: పాలస్తీనా వ్యక్తిని కాల్చి చంపిన ఇజ్రాయెల్ బలగాలు