Russia Ukraine war: ఉక్రెయిన్పై సైనిక చర్యకు దిగుతున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన వెంటనే రాజధాని కీవ్ సహా అనేక నగరాల్లో పేలుళ్లు సంభవించాయి. తూర్పున ఉన్న సముద్ర తీర నగరమైన మారియూపోల్లోనూ శక్తిమంతమైన పేలుళ్లు జరిగాయి. దేశంలోని అతిపెద్ద నగరాలైన ఒడేసా, ఖార్కీవ్లలోనూ పేలుడు శబ్దాలు వినిపించాయి. యుద్ధ ప్రకటన నేపథ్యంలో రష్యా దళాలు ఉక్రెయిన్పై విరుచుకుపడుతున్నట్లు తెలుస్తోంది.


Powerful explosions in Ukraine
Ukraine cyberattacks: మరోవైపు, ఉక్రెయిన్ పార్లమెంట్ సహా ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యాంకింగ్ వెబ్సైట్లు సైబర్ దాడులకు గురయ్యాయి. దీంతో సేవలు నిలిచిపోయాయి. గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని సైబర్ సెక్యూరిటీ నిపుణులు తెలిపారు. విధ్వంసకర మాల్వేర్ను వందలాది కంప్యూటర్లలోకి చొప్పించారని వెల్లడించారు. లాత్వియా, లిథువేనియా దేశాల్లోని కంప్యూటర్లలోనూ వైరస్ దాడులు జరిగాయని చెప్పారు. ఓవైపు సైనిక చర్యకు పాల్పడుతున్న రష్యానే.. సైబర్ దాడులు చేసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఉక్రెయిన్పై సైబర్ దాడులు గతకొద్దిరోజుల నుంచి జరుగుతున్నాయి. డేటాను పూర్తిగా తుడిచిపెట్టే సామర్థ్యం ఉన్న మాల్వేర్ను తాము బుధవారం గుర్తించినట్లు ఈఎస్ఈటీ రీసెర్చ్ ల్యాబ్ తెలిపింది. దేశంలోని వందలాది కంప్యూటర్లలో ఇది బయటపడినట్లు వెల్లడించింది. ఎన్ని నెట్వర్క్లపై దీని ప్రభావం ఉందో ఇంకా తెలియలేదని పేర్కొంది. పెద్ద సంస్థలే లక్ష్యంగా దాడులు జరిగాయని వివరించింది.
ఇదీ చదవండి: ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన పుతిన్.. కీవ్లో పేలుడు