అన్ని జిల్లాల కలెక్టర్లు, ముస్లిం మత పెద్దలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఇచ్చిన హామీలను కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈనెలలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్న సీఎం.. రాష్ట్ర ప్రభుత్వానికి రోజుకు రావాల్సిన 150 కోట్ల మేర ఆదాయం రావడం లేదన్నారు. ప్రజలు ఇబ్బంది పడకూడదని ఎక్కడా లేని విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు.
పొదుపు సంఘాల్లోని మహిళలకు 24వ తేదీన సున్నా వడ్డీ కార్యక్రమం కింద 1400 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నట్లు సీఎం ప్రకటించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం గత ప్రభుత్వం బకాయి పెట్టిన 1800 కోట్లు చెల్లించామని సీఎం తెలిపారు. ఈ ఏడాది మార్చి 31 వరకూ ఒక్క రూపాయి బకాయి లేకుండా పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ చేశామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి త్రైమాసికం పూర్తికాగానే తల్లి అక్కౌంట్లోకి నేరుగా చెల్లిస్తామని తెలిపారు.
ముస్లిం మత పెద్దలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రత్యేకంగా మాట్లాడారు. రంజాన్ మాసంలో అందరూ ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని కోరారు. దీనికి ముస్లిం మత పెద్దలు సమ్మతి తెలియజేయడంపై పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు సీఎం తెలిపారు. మసీదులకు ఐదువేల చొప్పున ఇస్తామని సీఎం వెల్లడించారు.
మసీదులతో పాటు ప్రతి చర్చికీ, ప్రతి గుడికీ ఐదు వేలు చొప్పున ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సీఎం తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలకు ప్రజలందరూ సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
ఇదీచదవండి