తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్, ఆ పార్టీ నేత పట్టాభిపై దాడులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం తీసుకురావడానికి పెద్దఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అన్యాయంగా ప్రతిపక్ష నేతలను తీసుకెళ్లి అరెస్టు చేసి జైల్లో పెట్టేందుకు ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నించటం దుర్మార్గమన్నారు.
పోలీసులను తమ చెప్పుచేతల్లో పెట్టుకుని అరాచకాలకు పాల్పడితే.. ప్రజలు తగు రీతిలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ ఘటనలపై డీజీపీ, ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. అచ్చెన్నాయుడుపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. పట్టాభిపై దాడి చేసిన దుండగులను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలన్నారు.
కేసుల మాఫీ కోసం బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం
28 మంది ఎంపీలున్నా..రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా,విభజన హామీల అమలు, పోలవరం నిధులు సాధించటంలో వైకాపా వైఫల్యం చెందిందని సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ విమర్శించారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ..సీపీఐ ఆధ్వర్యంలో దాసరి భవన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇది పూర్తిగా కార్పొరేట్ వర్గాలకు లబ్ధి చేకూర్చే బడ్జెట్ అని ఆయన విమర్శించారు. బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపారని...దీనికి వైకాపా ఎంపీల వైఫ్యల్యమే కారణమన్నారు. కేసుల మాఫీ కోసం దిల్లీ చుట్టూ తిరుగుతూ..రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు.
ఇదీచదవండి: తెదేపా నేత పట్టాభిపై దాడి.. మోకాలు, చేతులకు గాయాలు.. కారు ధ్వంసం