కరోనా మృతులకు ప్రభుత్వం ఏం సాయం చేసిందో చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. కరోనా నివారణకు ముందస్తు చర్యలు ఏం తీసుకున్నారని ప్రశ్నించారు. వ్యాక్సినేషన్కు పెట్టిన ఆర్డర్లు, చేసిన చెల్లింపులు, కరోనా బాధితులకు ఇచ్చిన సాయం తదితరాలపై వెంటనే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెదేపా ముఖ్య నేతలు, మండలాధ్యక్షులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. కరోనా వ్యాక్సిన్ అందరికీ వేసేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కరోనాతో చనిపోయిన వారికి ఆర్థిక సాయం అందించాలి
కరోనా మృతుల దహన సంస్కారాలకు రూ.15 వేల సాయం ప్రకటించి అమలు చేయకపోవడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. కరోనా మృతులకు ఉచితంగా, గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. అన్న క్యాంటీన్లను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఆక్సిజన్ అందక మృతి చెందిన వారి కుటుంబాలకు..రూ. 10 లక్షల ఆర్థికసాయం, ఇతర కరోనా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల సాయం చేయాలని డిమాండ్ చేశారు. కరోనా వల్ల పనులు కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులు, భవన నిర్మాణ కార్మికులు, పేదలకు రూ.10వేలు ఆర్థికసాయం అందించాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు.
మద్యం అమ్ముకోవటం కోసమే లాక్డౌన్ విధించలేదు
కరోనాకు అవసరమైన మందులు, ఆక్సిజన్ సరఫరా, ఆసుపత్రుల్లో బెడ్ల కేటాయింపుల్లో బ్లాక్ మార్కెట్ నిర్వహిస్తున్న వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాలన్నారు. కడప జిల్లాలో జరిగిన పేలుళ్లలో 10 మంది ప్రాణాలు కోల్పోడానికి కారణమైన ఎక్స్ ప్లోజివ్స్ లైసెన్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 12వ తేదీన కరోనా మృతుల సంస్మరణార్థం కొవ్వుత్తుల ప్రదర్శన చేయాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ పెట్టారని.. ఏపీలో మద్యం అమ్ముకోవడం కోసమే కర్ఫ్యూను పెట్టారని విమర్శించారు. ఇతర రాష్ట్రాల వలే లాక్ డౌన్ను పెట్టకపోవడాన్ని ఖండించారు. తిరుపతి రుయా సందర్శనకు వైకాపా నేతలకు అనుమతిచ్చి.. తెదేపా నిజనిర్థారణ కమిటీ నేతలను అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
కరోనా రోగి మృతదేహాన్ని నడిరోడ్డుపైనే దింపేయడం అమానుషం: చంద్రబాబు