కరోనా అన్ని రంగాలను అతలాకుతలం చేసింది. దీనికితోడు పెరిగిన పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలతో ఆటో, క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి మరీ దయానీయంగా తయారైంది. సొంత వాహనాలు ఉన్న యజమానులు సైతం డ్రైవర్లుగా మారిపోయారు. కొందరు ఆటోలు అమ్ముకుని అద్దెకు నడుపుకుంటున్నారు. ఆటోలు, క్యాబ్ డ్రైవర్లు వారి వాహనాలకు ఈఎమ్ఐ చెల్లించలేక వాటికి అమ్ముకుని కూలీ పనులకు వెళ్తున్నారు. అన్ని సమస్యలు ఒకేసారి చుట్టుముట్టడంతో.. వీరి జీవితం అగమ్యగోచరంగా మారింది.
బాడుగు డబ్బులు చాలట్లేదు..
లాక్డౌన్ కాలంలో వాహనాలు పూర్తిగా తిరగకపోవటం.. అప్పులు తెచ్చి కుటుంబాన్ని బతికించుకోవటంతో డ్రైవర్లు ఆర్థికంగా చితికిపోయారు. ఆ తర్వాత అయినా పరిస్థితి గాడిన పడుతుందనుకుంటే.. పెరిగిన ధరలతో మరింత అగాధంలోకి పడిపోయారు. ప్రయాణ ఛార్జీలు మాత్రం మూడేళ్ల క్రితం ఉన్న ధరలే తీసుకుంటున్నా.. ఇంధన ధరలు మాత్రం దాదాపు మూడింతలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాడుగు డబ్బులు ఏ మాత్రం సరిపోవడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు.
వాహన మిత్ర సాయం యజమానులకే..
ప్రభుత్వం అందిస్తున్న వాహనమిత్ర సాయం యజమానులకే అందుతోందని.. తమకు ఎలాంటి భరోసా లభించడం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల చలానాలు సైతం తామే చెల్లించుకోవాల్సి వస్తోందంటున్నారు. ఆటో అద్దెలు సైతం భారీగా పెరిగిపోయాయంటున్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లని, రిక్షావాలాలని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. పెరిగిన నిత్యావసర సరకుల ధరలతో కుటుంబాన్ని పస్తులు ఉంచే స్థితికి చేరుకున్నామని విలపిస్తున్నారు.
ఇదీ చదవండి: ROJA: పార్టీ ఆదేశాలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలి: రోజా