నిత్యం గోవింద నామస్మరణతో మార్మోగే తిరుగిరులు... కరోనా ప్రభావంతో నిర్మానుష్యంగా మారాయి. కాలాలతో సంబంధం లేకుండా భక్త జనంతో కిక్కిరిసిపోయే తిరుమల... దర్శనాల సంఖ్యను తితిదే పరిమితం చేయగా భక్తుల సంచారం పూర్తిగా తగ్గిపోయింది. ఫలితంగా శేషాచల అభయారణ్యంలో ఉన్న తిరుమలలో వన్యప్రాణుల సంచారం పెరిగింది. ప్రాంతం ఏదైనా జింకలు, దుప్పులు వంటి సాధు జంతువులు మొదలు చిరుతలు, ఎలుగుబంట్లు వంటి క్రూరమృగాలు తిరువీధుల్లో యధేచ్ఛగా తిరుగుతున్నాయి. గతంలో భక్తుల రద్దీతో ఉండే ప్రాంతాల్లోనూ వన్యప్రాణులు సంచరిస్తున్నాయి. జీఎన్సీ టోల్గేట్, బాహ్యవలయ రహదారి, ఎస్వీ గెస్ట్హౌస్, పద్మావతి ప్రాంతం, ఎంబీసీ ప్రాంతం, కౌస్తుభం అతిథి గృహం, బాలాజీనగర్ ప్రాంతాల్లోకి వన్యప్రాణులు ప్రవేశిస్తున్నాయి. సాధారణ రోజుల్లో భక్తులు తిరిగే ప్రాంతాల్లో ఇపుడు చిరుత పులులు దర్శనమిస్తున్నాయి.
చీకటిపడితే తిరుమల వీధుల్లో వన్యప్రాణులు ప్రత్యక్ష అవుతుండటంతో తితిదే అధికారులు అప్రమత్తమయ్యారు. క్రూరమృగాల నుంచి భక్తులకు భద్రత కల్పించడానికి చర్యలు చేపట్టారు. అడవి జంతువులు తరచూ సంచరించే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో తగినజాగ్రత్తలు తీసుకొంటున్నారు. ధర్మగిరి వేదపాఠశాల, శ్రీవారిపాదాలు, పాపవినాశనం, కాలినడక మార్గాల నుంచి తిరుమలలోకి ప్రవేశించే ప్రాంతాలు ఇలా వన్యప్రాణుల సంచారం అధికంగా ఉండే 39 ప్రాంతాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వన్యప్రాణులు తిరుమల రహదారిపైకి వచ్చిన వెంటనే వాటి ఆచూకి తెలిపేలా భద్రత పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రానికి సమాచారం చేరేలా ఏర్పాటు చేశారు. క్రూరమృగాల సంచారాన్ని గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఉన్న భక్తులను అప్రమత్తం చేయడంతో పాటు... అలారం మోగేలా సాంకేతిక పరిజ్ఞానం ఉన్న కెమెరాలను వినియోగిస్తున్నారు.
మరో వైపు సాయంత్రం ఆరు గంటల తర్వాత వన్యప్రాణుల సంచారం అధికంగా ఉన్న ప్రాంతాల వైపు భక్తుల సంచారం నియంత్రిస్తున్నారు. ప్రత్యేకంగా సెక్యూరిటీ పోస్ట్లు ఏర్పాటు చేసి నిరంతరం గస్తీకాసేలా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండీ...న్యాయవ్యవస్థపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రవ్యాఖ్యలు