రోజువారీ కార్యకలాపాలకు సంబంధించిన సాధారణ ప్రభుత్వ ఉత్తర్వులను వెబ్సైట్లో ఎందుకు పెట్టడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రొటీన్ జీవోలను వెబ్సైట్లో ఉంచకపోవడం సరికాదని వ్యాఖ్యానించింది. ప్రజాధనంతో ముడిపడి ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులన్నీ 24 గంటల్లో వెబ్సైట్లో ఉంచేలా చూడాలని మౌఖికంగా పేర్కొంది. రహస్యం (సీక్రెట్), అతి రహస్యం (టాప్ సీక్రెట్)గా ఉంచాల్సినవి తప్ప మిగిలిన జీవోలను వెబ్సైట్లో ఉంచడం వల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటని వ్యాఖ్యానించింది. భద్రతా కారణాల రీత్యా వెల్లడించకూడని ఉత్తర్వులను అప్లోడ్ చేయకపోతే అర్థం చేసుకోగలం కానీ సాధారణ వ్యవహారాల ఉత్తర్వులనూ ప్రజలకు అందుబాటులో ఉంచకపోవడం సరికాదంది. గత విధానంతో జీవోల అప్లోడింగ్ సాఫీగా జరుగుతున్నప్పుడు.. ఆ పద్ధతిని మార్చాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను అక్టోబర్ 27కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
జీవోలను ‘జీవోఐఆర్’ వెబ్సైట్లో ఉంచకపోవడాన్ని సవాలు చేస్తూ.. జీఎంఎన్ఎస్ దేవి, గుంటూరు జిల్లాకు చెందిన కోమటినేని శ్రీనివాసరావు, న్యాయవాది ఎస్ఆర్ ఆంజనేయులు హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. వారి తరఫు న్యాయవాదులు శ్రీకాంత్, కారుమంచి ఇంద్రనీల్బాబు, వై.బాలాజీ వాదనలు వినిపించారు. ‘జీవోఐఆర్ వెబ్సైట్లో అప్లోడ్తో ప్రజలకు సులువుగా జీవోలు అందుబాటులో ఉండేవి. దానికి స్వస్తి పలికి, ఆ స్థానంలో ఏపీఈ గెజిట్ వెబ్సైట్లో అతి తక్కువగా (గతంతో పోల్చితే 12.3%) జీవోలను ఉంచుతున్నారు. జీవో 100 తీసుకొచ్చి.. రహస్యం, అత్యంత రహస్యం, గోప్యత జీవోలంటూ వర్గీకరించారు. వారానికి ఓసారి జీవోలను ఏపీఈ గెజిట్లో పెడుతున్నారు. గోప్యత ముసుగులో ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన వాటిని అప్లోడ్ చేయడం లేదు. జీవోలపై అభ్యంతరం ఉంటే న్యాయస్థానాల్లో సవాలు చేయడానికి వీల్లేకుండా చేశారు’ అన్నారు.
వెబ్సైట్ మాత్రమే మారింది: ప్రభుత్వ న్యాయవాది
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సుమన్ వాదనలు వినిపిస్తూ.. రహస్యం, అత్యంత రహస్యం, గోప్యత జీవోలు తప్ప మిగిలినవి ఏపీఈ గెజిట్లో ఉంచుతున్నామన్నారు. కేవలం వెబ్సైట్ మాత్రమే మారిందన్నారు. గోప్యమైన ప్రభుత్వ ఉత్తర్వులను గతంలో వెబ్సైట్లో పెట్టినా, ఖాళీగా చూపించేవారన్నారు. కాన్ఫిడెన్షియల్ (గోప్యత) జీవోలు అంటే ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. ఏపీ సచివాలయ కార్యాలయ మాన్యువల్లో పేర్కొన్నారంటూ కొన్నింటిని ఎస్జీపీ ఉదహరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్లు లేవనెత్తిన ప్రతి అంశానికి బదులిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: