ఫార్మాసిటీ అంటేనే కుంభకోణమని... దానితో ధనార్జనే లక్ష్యమని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. బంగారం పండే భూములను లాక్కొని ప్రజల జీవితాలతో ఆడుకుంటోందని ఆ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా నక్కర్త మేడిపల్లిలో నిర్మించనున్న ఔషధ నగరి-ఫార్మాసిటీకి వ్యతిరేకంగా యాచారంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. నల్ల కండువాలు వేసుకుని నిరసన తెలిపారు.
భూములు కోల్పోతున్న రైతులను కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. ఫార్మాసిటీ నుంచి వెలువడే కాలుష్యంతో ప్రజలు అనారోగ్యం బారిన పడతారని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఫార్మాసిటీ రద్దు చేస్తామన్నారు. నేల తల్లిని నమ్ముకుని బతికే రైతన్నలకు తెరాస ప్రభుత్వం అన్యాయం చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలకు వ్యతిరేకంగా ఫార్మా కంపెనీలు పెట్టి... ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటుంటే చూస్తూ ఊరుకోబోమని భట్టి హెచ్చరించారు.