రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలతో పాటు పురపాలక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఎన్నికల నిర్వహణకు రాత పూర్వక అంగీకారం తెలిపింది. త్వరలో పురపాలక ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తున్న తరుణంలో... రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలపింది. ఈ మేరకు.. త్వరలోనే పురపాలక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
ఆగిన చోట నుంచే తిరిగి పురపాలక ఎన్నికల ప్రక్రియ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పురపాలక ఎన్నికల నిర్వహణపై న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని ఎస్ఈసీ భావిస్తోంది. పరిషత్ ఎన్నికల్లో ఏకగ్రీవాలను రద్దు చేయాలని గతంలో విపక్షాలు ఎస్ఈసీని కోరాయి. పాత నోటిఫికేషన్ రద్దు చేసి తిరిగి నోటిఫికేషన్ ప్రకటించాలని సూచించాయి. న్యాయ నిపుణుల సూచనల తర్వాత పరిషత్ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది.