భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సైనికులు, అధికారులు వెంటనే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలు తొలగించాలని ఆదేశించింది. జులై 15లోపు 89 యాప్లను మొబైల్ ఫోన్ల నుంచి తొలగించాలని పేర్కొంది. సమాచార భద్రతా ఉల్లంఘన, హనీట్రాప్(వలపు ఉచ్చు) వంటి ఘటనల నేపథ్యంలో సైన్యం కఠినంగా వ్యవహరిస్తోంది.
ప్రస్తుత ఆదేశాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైన్యం హెచ్చరించింది. టిక్టాక్, హెలో, షేర్ఇట్ సహా ప్రభుత్వం నిషేధించిన 59 యాప్లు సైతం ఈ జాబితాలో ఉన్నాయి. 'పాకిస్థాన్, చైనా ఇంటలిజెన్స్ వర్గాలు ఆన్లైన్లో సైనికులను లక్ష్యంగా ఎంచుకుంటున్న ఘటనలు పెరుగుతుండటంతో ఈ ఆదేశాలు జారీ చేశాం' అని సైనికాధికారి ఒకరు తెలిపారు.
గతేడాది నవంబర్లోనూ అధికారిక పనుల కోసం వాట్సాప్ను ఉపయోగించకూడదని సైన్యం ఆదేశించింది. ఫేస్బుక్ ఖాతాల్లోని సున్నితమైన సమాచారాన్ని తొలగించాలని సూచించింది. మహిళల పేరుతో పాకిస్థాన్ ఏజెంట్లు భారత సైనికులను వలపు ఉచ్చులోకి దించుతున్న ఘటనలు రెండు మూడేళ్లుగా ఎక్కువయ్యాయి. ఫేస్బుక్ వాడొద్దని, కార్యాలయాల్లోకి, నావల్ డాక్ల్లోకి మొబైళ్లు తీసుకురావొద్దని భారత నౌకాదళం సైతం తమ సిబ్బందిని ఇంతకుముందే ఆదేశించింది.
![Army asks soldiers officers to delete Facebook and Instagram accounts uninstall 89 apps](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7957666_1.jpg)
ఇదీ చూడండి: స్వచ్ఛ భారత్కు జైకొడుతూ మోదీకి వెండి విగ్రహం