విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్గా వి.ప్రసన్న వెంకటేష్ బాధ్యతలు స్వీకరించారు. 2012 IAS బ్యాచ్కు చెందిన ప్రసన్న వెంకటేష్... తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు. గతంలో విశాఖ జిల్లా పాడేరు సబ్ కలెక్టర్, సీఆర్డీఏ అదనపు కమిషనర్గా పని చేశారు. అనంతరం వివిధ శాఖల్లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.
బాధ్యతలు తీసుకున్న అనంతరం వెంకటేష్ మాట్లాడారు. విజయవాడలో పారిశుద్ధ్యం మెరుగుదలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి, స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. నూటికి నూరు శాతం ప్లాస్టిక్ వినియోగాన్ని అరికడతామని కమిషనర్ తెలిపారు. తాగునీటి, ట్రాఫిక్ సమస్యలపై అవగాహన ఉందన్న ఆయన... ఈ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
పర్యావరణ హితంగా... కిచెన్, రూఫ్ టాప్ గార్డెన్లను ప్రోత్సహిస్తామని చెప్పారు. నగరపాలక సంస్థ పాఠశాలలను పచ్చదనంతో నింపుతామని...ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తానని అన్నారు. నగరపాలక సంస్థలో అవినీతి, అక్రమాలను సహించబోనని స్పష్టంచేశారు. తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, సుందరీకరణ, ప్రజారోగ్యం వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతానని హామీఇచ్చారు.
ఇదీ చదవండి : 'వైకాపాను ప్రశ్నించాడనికి కాస్త సమయం వేచి చూస్తాం'