Woman Stopped Train: విరిగిపోయిన రైలు పట్టా... దూసుకొస్తున్న రైలు.. అధికారులకు సమాచారం ఇద్దామంటే దగ్గర్లో ఫోన్ లేదు.. వేగంగా నడుచుకుంటూ వెళ్లి ఎవరికైనా చెప్పేంత ఓపిక లేదు.. నరాలు తెగే ఉత్కంఠతో కూడిన ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించింది ఓ వృద్ధురాలు. తన ఒంటిపై ఉన్న ఎర్ర చీరనే అస్త్రంగా చేసుకుని రైలును ఆపి.. వందలాది మంది ప్రాణాలు కాపాడింది. అందరి ప్రశంసలు అందుకుంటోంది.
పొలానికి వెళ్తుంటే..: ఓంవతీ దేవి(65).. ఉత్తర్ప్రదేశ్ ఎటా జిల్లా అవాగఢ్ మండలం గులేరియా గ్రామవాసి. గురువారం ఇంటి నుంచి రైలు పట్టాల మీదగా పొలానికి వెళ్తోంది. కుస్బా రైల్వే స్టేషన్ సమీపంలో ఒక పట్టా విరిగి ఉండడాన్ని గమనించింది. ఏ సమయంలోనైనా రైలు రావచ్చని భావించిన ఆమె.. ఎలాగైనా ప్రమాదాన్ని నివారించాలని అనుకుంది. అయితే.. ఈ సమాచారం సంబంధిత సిబ్బందికి ఎలా తెలియచేయాలో ఓంవతీ దేవికి తెలియలేదు. అందుకు అవసరమైన వనరులు కూడా ఆమె దగ్గర లేవు.

Woman Red Saree Train: బాగా ఆలోచించిన ఓంవతీ దేవి.. తన ఒంటిపై ఎర్ర చీరనే అస్త్రంగా చేసుకుంది. చీర విప్పి.. పట్టాలపై నిల్చుని జెండాలా ఊపడం ప్రారంభించింది. పక్కనున్న రెండు చెట్టు కొమ్మలు విరగ్గొట్టి.. పట్టాలకు అడ్డంగా ఎర్ర చీరను కట్టింది. కాసేపటికే ఎటా నుంచి టుండ్లా వెళ్తున్న పాసింజర్ రైలు వచ్చింది. పట్టాలకు అడ్డంగా ఎర్ర వస్త్రం ఉండడాన్ని గమనించిన డ్రైవర్.. వెంటనే బ్రేక్ వేశాడు. రైలు ఆగిన వెంటనే దిగి చూస్తే.. పట్టా విరిగి ఉంది. పక్కనే ఓంవతీ దేవి కనిపించింది. రైలు పట్టా దెబ్బతిన్నట్టు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు ట్రైన్ డ్రైవర్. ఇంత సాయం చేసిన ఓంవతీ దేవికి ఆమె వద్దంటున్నా రూ.100 నగదు పురస్కారం అందించాడు.

Etah News: ట్రైన్ డ్రైవర్ సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు.. విరిగిన రైలు పట్టాను సరిచేశారు. గంట తర్వాత రైలు ప్రయాణం తిరిగి ప్రారంభమైంది. ఇంతకుముందు టుండ్లా నుంచి ఎటాకు ఇదే రైలు వెళ్లిందని, అప్పుడే పట్టా దెబ్బతిని ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే.. ట్రాక్ను పరిశీలించిన లైన్మ్యాన్ అంతా బాగుందని చెప్పాడని అన్నారు. కానీ పట్టా ఎప్పుడు విరిగిపోయి ఉంటుందో తెలియదన్నారు.

ఓంవతిపై ప్రశంసల జల్లు: ఓంవతీ దేవిపై అనేక మంది ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఓంవతి హర్షం వ్యక్తం చేసింది. "ఎరుపు.. ప్రమాదానికి సంకేతమని తెలుసు. అందుకే రైలు పట్టాలపై ఎర్ర చీర కడితే డ్రైవర్ అప్రమత్తం అవుతాడని అనుకున్నా. అందుకే అలా చేశా. డ్రైవర్ నాకు రూ.100 బహుమానంగా ఇచ్చాడు. నేను వద్దని చెప్పినా తీసుకోవాల్సిందేనని పట్టుబట్టాడు." అని చెప్పింది ఓంవతి.

ఇదీ చదవండి: 14 అడుగుల కింగ్ కోబ్రా.. 2.5 నిమిషాల హైటెన్షన్.. చివరకు...