కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తన సోదరుడు, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు. రాహుల్ను యోధుడుగా ఆమె అభివర్ణించారు. అంబానీ, అదానీ వంటి పారిశ్రామికవేత్తలు.. రాహుల్ను కొనలేరని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ప్రతిష్ఠను దెబ్బతిసేందుకు కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఆయన భయపడరని ప్రియాంక స్పష్టం చేశారు. దిల్లీ నుంచి ఉత్తర్ప్రదేశ్లోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించిన సందర్భంగా ఆమె రాహుల్కు స్వాగతం పలికారు.
"అదానీ, అంబానీ వంటి పెద్ద పారిశ్రామికవేత్తలు.. చాలా మంది రాజకీయ నాయకులను, మీడియాను, ప్రభుత్వ రంగ సంస్థలను కొనుగోలు చేసి ఉండవచ్చు. కానీ వారు నా సోదరుడు రాహుల్ గాంధీని కొనలేరు. రాహుల్ గాంధీకి శీతాకాలంలో కూడా చలి వేయట్లేదని ప్రజలు అంటున్నారు.. అందుకు కారణం ఆయన సత్యం అనే కవచాన్ని ధరించడమే. కన్యాకుమారి నుంచి 3,000 కిలోమీటర్లు యాత్ర చేసిన నా సోదరుడిని ఉత్తర్ప్రదేశ్లోకి స్వాగతం పలకడం గర్వంగా ఉంది."
--ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి
![rahul gandhi bharat jodo yatra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17385734_hh.jpg)
![rahul gandhi bharat jodo yatra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17385734_qq.jpg)
నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) మాజీ చీఫ్ ఏఎస్ దులత్ దిల్లీలో రాహుల్ గాంధీతో కలిసి కాసేపు నడిచారు. తొమ్మిది రోజుల విరామం అనంతరం రాహుల్ గాంధీ.. ' భారత్ జోడో యాత్ర' మంగళవారం దిల్లీలో తిరిగి ప్రారంభమై.. ఉత్తర్ప్రదేశ్లోకి ప్రవేశించింది. గాజియాబాద్లోని లోనీ సరిహద్దు వద్ద రోడ్డుకు ఇరువైపులా కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేయాభిలాషులు రాహుల్కు స్వాగతం పలికారు. ఈ యాత్రలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, దిల్లీ కాంగ్రెస్ చీఫ్ అనిల్ కుమార్ చౌదరి, సీఎల్పీ నేత ఆరాధన మిశ్రా సహా ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
![rahul gandhi bharat jodo yatra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17385734_ff.jpg)
![rahul gandhi bharat jodo yatra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17385734_tt.jpg)
![rahul gandhi bharat jodo yatra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17385734_rahul.jpg)
భారత్ జోడో యాత్ర రెండు రోజుల పాటు ఉత్తర్ప్రదేశ్లో జరగనుంది. అనంతరం గురువారం సాయంత్రానికి హరియాణాలోని పానీపత్లోకి ప్రవేశించనుంది.