ఉచితంగా పాలు, గుడ్లు ఇచ్చి పిల్లలకు అన్నం పెట్టడమే కాదు.. వారికి అక్షరాలు నేర్పి భవిష్యత్తుకు పునాదులు వేయడం కూడా అంగన్వాడి కేంద్రాల బాధ్యతే. కానీ, తమ పిల్లలు రంగులతో హంగులు దిద్దిన ప్రైవేటు పాఠశాలల్లో చదివితేనే చదువొస్తుంది అనుకుంటారు చాలా మంది తల్లిదండ్రులు. అందుకే, రెండేళ్లు నిండగానే ఊర్లో ఉన్న అంగన్వాడికి పంపకుండా.. అప్పు చేసి మరీ ప్రైవేటు స్కూళ్లలో చేర్చుతారు. ఈ పద్ధతికి స్వస్తి పలికించే ప్రయత్నం చేస్తున్నారు కర్ణాటక చిక్కబళ్లాపుర్ జిల్లా అధికారులు.
చిక్కబళ్లాపుర్ జిల్లా పరిషత్ సీఈఓ పౌజి తరుణం.. ప్రైవేటు పాఠశాలలను తలదన్నే అంగన్వాడి భవనాలను నిర్మిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'న్రెగా' పథకం కింద రూ.5 లక్షలు, మహిళా శిశు అభివృద్ధి పథకం కింద రూ.3 లక్షలు మొత్తం రూ. 8 లక్షలతో జిల్లాలో కొత్త అంగన్వాడి కేంద్రాలు ఏర్పాటు చేయిస్తున్నారు.
అంగన్వాడి గోడలపై ఆంగ్ల, కన్నడ అక్షరాలు, అంకెలు, పక్షులు, జంతువుల పేర్లు.. ఆకట్టుకునే బొమ్మలు వేయించారు. అంతే కాదు, సకల వసతులు కల్పించి ప్రభుత్వ బడి రూపు రేఖలే మార్చేశారు. దీంతో గ్రామాల్లోని పిల్లలు, తల్లిదండ్రులు అంగన్వాడి బడివైపు మొగ్గు చూపుతున్నారు.
ఇదీ చదవండి: కాషాయం రంగులో కళకళలాడుతున్న కాండం!