Woman Gave Birth To Baby In Auto Bhadrachalam : ప్రసవ నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి ప్రసవం చేసే వైద్యులు లేక ఆటోలోనే ప్రసవించిన ఘటన భద్రాచలంలో చోటు చేసుకుంది. చప్పిడి దిగువ ఏరియాకి చెందిన సంధ్య అనే గర్భిణీకి ప్రసవ నొప్పులు రావడంతో బుధవారం అర్ధరాత్రి భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి ఆటోలో తీసుకెళ్లారు. గర్భిణీని ఆసుపత్రిలో చేర్చుకొని ప్రసవం చేయాలని కోరగా సిబ్బంది ఎవరూ లేరని కొత్తగూడెం తీసుకెళ్లాలని సూచించారు.
అప్పటికే ఆమెకు నొప్పులు ఎక్కువ కావడంతో చికిత్స అందించాలని కోరినప్పటికీ ఆసుపత్రి సిబ్బంది వినలేదు. దీంతో రాత్రి ఒంటి గంట సమయంలో గర్భిణికి ఆటోలోనే ప్రసవం జరిగింది. ప్రసవం జరిగిన తర్వాత ఆసుపత్రి సిబ్బంది తల్లీబిడ్డను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా రోజులుగా వైద్యులు సరిగా విధులకు హాజరు కాకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు.