Heavy rainfall in Telangana today : ఉమ్మడి మహబూబ్నగర్ పరిధిలో గల అన్ని జిల్లాల్లో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లా, మరికల్ మండలంలో 11 సెంటీ మీటర్లు, దామరగిద్దలో 10సెంటీమీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లాలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వానలకు వాగులూ, వంకలూ పొంగి పొర్లుతున్నాయి.
నారాయణపేట మండలంలో వాగులు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. దామరగిద్ద మండలంలో పలుచోట్ల వరి సహా అన్ని పంటలు నీట మునిగాయి. వనపర్తి జిల్లా, మదనపురం మండలంలో సరళా సాగర్ జలాశయానికి భారీ ఎత్తున వరదనీరు వచ్చి చేరుతోంది. అడ్డాకుల మండలం వర్ని వద్ద పెద్దవాగు పొంగి పొర్లుతోంది. ఇక ప్రముఖ పుణ్య క్షేత్రం ఉమామహేశ్వరంలో కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతం సందర్శకులను కనువిందు చేస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు కొండల పైనుంచి వరద నీరు కిందకు జాలువారుతోంది.