Gold Thief arrested in Basheerbagh : ప్రియురాలి మోజులో పడి పని చేస్తున్న సంస్థకే కన్నం వేసిన ఘనుడిని, హైదరాబాద్ నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. బషీర్బాగ్ చంద్రనగర్కు చెందిన మర్రి సాయి లక్ష్మణ్ గత 8 ఏళ్లుగా బషీర్బాగ్లోని శ్రీ సిద్ది వినాయక్ జువెల్లర్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలో స్టాక్ ఇంఛార్జ్గా పని చేస్తున్నాడు. గత 2 నెలల క్రితం నుంచి సాయి లక్ష్మణ్ విధులకు రాకపోవడం, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో సదరు యజమానికి అనుమానం వచ్చి ఆడిట్ నిర్వహించాడు.
అందులో 28 తులాల బంగారం మిస్సింగ్ అయినట్లు గుర్తించారు. దీంతో అనుమానం వచ్చిన యజమాని నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఇవాళ సాయి లక్ష్మణ్ను అదుపులోకి తీసుకొని విచారించారు. తానే దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడించాడు. దొంగిలించిన బంగారాన్ని విక్రయిస్తూ, తన ప్రియురాలితో దేవస్థానాలు తిరిగినట్లు ఒప్పుకున్నాడు.