By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 5, 2024, 5:43 PM IST
రోజాకు నగరి టికెట్ ఇస్తే ఓడిస్తాం: వైఎస్సార్సీపీ నేతలు
YSRCP ZPTC Member Muralidhar Reddy Comments on Roja: మంత్రి రోజాకు ఆమె సొంత నియోజకవర్గం నగరిలోనే అసమ్మతి సెగ తగులుతోంది. ఆమెకు వ్యతిరేకంగా వర్గపోరు తీవ్రమవుతోంది. మంత్రి రోజాకు నగరి సీటు (Nagari Ticket) ఇస్తే ఓడించడం ఖాయమని ఆ ప్రాంత వైఎస్సార్సీపీ నేతలు (YSRCP Leaders) అధిష్టానాన్ని హెచ్చరించారు. తిరుపతి జిల్లా వడమాలపేట జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి రోజాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ నగరిలో రోజాకి తప్ప ఇంకెవరికి సీటు కేటాయించినా గెలిపించుకుని తీరుతామని తెలిపారు. 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయి ఐరన్ లెగ్గా ముద్రపడిన రోజాను తమ కష్టంతో రెండుసార్లు గెలిపించామన్నారు. మంత్రి రోజా అన్నదమ్ముల అవినీతి, అక్రమాలకు తాము అడ్డుగా ఉన్నామని దూరం పెట్టారన్నారని మురళీధర్ రెడ్డి ఆరోపించారు. మా పదవులపై మంత్రి రోజా భర్త సెల్వమణి ఏ హోదాలో మాట్లాడుతున్నారు. మాకు పదవులు ఇచ్చామని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉందని మురళీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.