సత్యసాయి జిల్లాలో ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యం - మహిళ ఇల్లు కూల్చివేత
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 14, 2024, 5:23 PM IST
YSRCP Leaders Demolish House Foundation: ఒంటరి మహిళ అని జాలి కూడా లేకుండా వైఎస్సార్సీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. పునాది వేసుకున్న ఇంటిని కూల్చేసి వారి అక్కసు వెళ్లబుచ్చుకున్నారు. అడ్డు వెళ్లినందుకు మహిళపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో చేయి విరిగిందని, వ్యక్తిగత దూషణలు చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని, లేకపోతే ఆత్మహత్యే శరణ్యం బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు.
సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధి బీడుపల్లి గ్రామంలో 2019 సంవత్సరంలో శ్యామల పేరు మీదుగా తెలుగుదేశం ప్రభుత్వం రెండు సెంట్లు భూమిని కేటాయించింది.ఈ స్థలం విషయంలో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారని మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్థలంలో ఇల్లు నిర్మిస్తుంటే వైఎస్సార్సీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని శ్యామల ఆరోపించారు. ఆదినారాయణ, రంగప్ప మరి కొంతమంది దౌర్జన్యంగా ట్రాక్టర్తో గోడలు, పునాదిని కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికపరమైన ఇబ్బందులతో 2019లో ఇల్లు నిర్మాణ పనులు చేపట్టలేదని, ప్రస్తుతం నిర్మాణ పనులు చేపడుతుంటే వైఎస్సార్సీపీ నాయకులు కూల్చివేశారని, అడ్డు వెళ్లినందుకు తనను కూడా కొట్టి దూషించారని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా ఎమ్మెల్యే అనుచరులకే మద్దతు ఇస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంటి స్థలం తనకు ఇప్పించి తగిన న్యాయం చేయాలని లేకపోతే ఆత్మహత్య శరణమని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.