అర్ధరాత్రి బిందెలతో రోడ్డెక్కిన మహిళలు- ఎట్టకేలకు దిగొచ్చిన అధికారులు - Women Protest With Empty Vessels - WOMEN PROTEST WITH EMPTY VESSELS
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 27, 2024, 5:11 PM IST
Women Protest With Empty Vessels at Ongole : ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ కూడలిలో తాగు నీటి సమస్యలపై మహిళలు శుక్రవారం అర్ధరాత్రి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గత 15 రోజులుగా మున్సిపాలిటీ అధికారులు నీటిని నిలిపివేయడంతో నీటి కోసం అనేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో తాగు నీటి సమస్య పరిష్కరించేంత వరకూ నిరసన ఆపబోమని మహిళలు తేల్చి చెప్పారు.
ఎండల తీవ్రత అధికంగా ఉండి, తాగేందుకు గుక్కెడు నీరు లేకున్నా మున్సిపల్ అధికారులు స్పందించకపోవటంపై స్థానికులు మండిపడుతున్నారు. మహిళలు నిరసన చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినకపోవటంతో పోలీసులకు, మహిళలకు మధ్య కొంత సమయం వాగ్వాదం చోటు చేసుకొంది. కాసేపటికి ఘటనాస్థలికి చేరుకున్న మున్సిపల్ అధికారులు ఈరోజు సాయంత్రంలోగా నీటిని అందిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళనను విరమించారు.