Published : Sep 5, 2024, 12:33 PM IST
దుర్గమ్మ వద్ద ఉప్పొంగుతున్న గంగమ్మ - ఏడుపాయల ఆలయం వద్ద ఉద్ధృతంగా ప్రవాహం - Edupayala Vanadurgamata temple
Edupayala Vanadurgamata temple: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గమాత ఆలయాన్ని ఐదు రోజుల నుంచి వరద నీరు వీడటం లేదు. ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి పటాన్ చెరువు సమీపంలోని నక్కవాగు నీరు మంజీరాలో చేరుతోంది. దాంతో వరద ఉద్ధృతంగా వస్తుండడంతో మంజీరా వరద ప్రవాహం పెరిగి వనదుర్గా ప్రాజెక్టు పూర్తిగా నిండి పొంగిపొర్లుతోంది.
ప్రాజెక్టు పైనుంచి గంగమ్మ పరవళ్లు తొక్కుతూ వనదుర్గామాత ప్రధాన ఆలయం ముందునుంచి నదీ పాయ ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఆలయ అర్చకులు, సిబ్బంది వనదుర్గామాత ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అర్చకులు మాత్రమే వెళ్లి అభిషేకం, సహస్రనామార్చన, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులు రాజగోపురంలో ప్రతిష్టించిన అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టగానే యధావిధిగా అమ్మవారి దర్శనం కొనసాగుతుందని ఆలయ ఈవో తెలిపారు. భక్తులు వనదుర్గా ప్రాజెక్టు వైపు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి పటిష్ఠ భద్రతను కల్పిస్తున్నారు