By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 16, 2024, 6:14 PM IST
ప్రొద్దుటూరులో వేడెక్కిన రాజకీయం - వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు భూదందాపై ఫ్లెక్సీ
TDP Leader Varadarajulu Reddy Allegations on MLA Rachamallu : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో రోజురోజుకు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా ప్రొద్దుటూరులో "రాచమల్లు భూ దందాను అడ్డుకుందాం రండి" అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దేవుని భూములు స్వాహా చేశారంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పేరుతో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. దొరసాని పల్లెలో చెన్నకేశవ స్వామి ఆలయానికి చెందిన రూ. 40 కోట్ల విలువ చేసే నాలుగు ఎకరాలు ఆక్రమించి రోడ్లు వేశారని ఆరోపించారు.
అదేవిధంగా ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. చెన్నకేశవస్వామి ఆలయ భూమిని స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి ఆక్రమించారని వరదరాజులరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్యెల్యేకు వ్యతిరేకంగా తెలుగుదేశం శ్రేణులు నినాదాలు చేశారు. ఆలయ భూములను రక్షించాలని డీటీ మనోహర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఆలయ భూమిలో రోడ్డు వేసే హక్కు ఎమ్మెల్యే రాచమల్లుకు ఎవరు ఇచ్చారని వరదరాజులరెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత రాచమల్లుకు లేదా అని నిలదీశారు. భూ కబ్జాలు చేసే ఎమ్మెల్యే రాచమల్లు ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ధ్వజమెత్తారు.