By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 6, 2024, 7:40 PM IST
శవ రాజకీయాలు చేయడంలో జగన్ రెడ్డి ఆరితేరారు: నాదెండ్ల బ్రహ్మం - Nadendla Brahmam on CM Jagan
TDP Leader Nadendla Brahmam Allegations on CM Jagan: శవ రాజకీయాలు చేయడంలో జగన్ రెడ్డి ఆరితేరాడని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం ధ్వజమెత్తారు. 2014లో తండ్రిని, 2019లో బాబాయి చావులను అడ్డుపెట్టుకొని శవ రాజకీయం చేశాడని దుయ్యబట్టారు. శవ రాజకీయాలు మాత్రమే జగన్ చేస్తాడని అతని కుటుంబసభ్యులే చెబుతున్నారని బ్రహ్మం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు 32 మంది అవ్వాతాతల మరణానికి జగన్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, సెర్ప్ సెక్రటరీ మురళీధర్ రెడ్డిలే కారకులని ఆరోపించారు. జగన్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కేవలం రాజకీయ లబ్ది కోసమే పెన్షన్ డ్రామాకు తెర లేపాడని విమర్శించారు.
1వ తేదీకి వారం మునుపే బినామీ కాంట్రాక్టర్ల కోసం 13 వేల కోట్ల రూపాయలు డ్రా చేసి 12.95 వేల కోట్లు దోచిపెట్టాడని ఆక్షేపించారు. మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు అని తెలిసి కూడా రాజకీయ లబ్ది పొందాలని పెన్షన్ సొమ్ములను డ్రా చేయలేదని మండిపడ్డారు. రెండు, మూడు నెలల క్రితమే బటన్ నొక్కిన చేయూత, విద్యా దీవెన, ఈబీసీ నేస్తం డబ్బులు ఎందుకు ఇంతవరకు డిపాజిక్ కాలేదని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేస్తామని ప్రైవేటు ఆసుపత్రులు నోటీసులు పంపుతున్నా వారికి బిల్లులు ఎందుకు విడుదల చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్ని డ్రామాలు ఆడినా, మసిపూసి మారేడు కాయలు చేసినా ప్రజలు జగన్ను నమ్మడం లేదని తేల్చిచెప్పారు.