NMR ఉద్యోగుల వేడుకోలు సభ- జగన్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 6, 2024, 3:52 PM IST
NMR Employees Protest at Vijayawada : సర్వీస్లను క్రమబద్ధీకరించాలంటూ విజయవాడ ధర్నా చౌక్లో NMR ఉద్యోగులు వేడుకోలు సభ నిర్వహించారు. జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తమను రెగ్యులర్ చేయాలన్నారు. టైం స్కేల్ ఫుల్ టైం, పార్ట్ టైం కంటిన్యూజెంట్ ఎంప్లాయిస్ సర్వీస్లను క్రమబద్ధీకరించాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్లో కంటింజెంట్ ఎంప్లాయీస్ సంఘం ఆధ్వర్యంలో వేడుకోలు సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్ఎమ్ఆర్ కంటిన్యూజెంట్ పార్ట్ టైం, ఫుల్ టైం ఎంప్లాయిస్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ 1993కి ముందు ఉద్యోగంలో నియమితులైన, 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న టైం స్కేల్ ఉద్యోగులను సుప్రీంకోర్టు ఉమాదేవి వర్సెస్ సెక్రటరీ కర్ణాటక ప్రభుత్వం కేసులో ఇచ్చిన తీర్పు మేరకు పది సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన తాత్కాలిక, కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని కోరారు. కంటింజెంట్ ఉద్యోగులను క్రమ బద్దీకరించాలని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చామన్నారు.