మంత్రి లోకేశ్ చొరవతో ఐఐటీ, ఎన్ఐటీల్లో దివ్యాంగ విద్యార్థులకు ప్రవేశం - Nara Lokesh Quick Response
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 7, 2024, 10:07 PM IST
Lokesh Quick Response: విద్యాశాఖ మంత్రి లోకేశ్ చొరవతో 25 మంది దివ్యాంగ విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీలలో సీట్లు పొందారు. ఈ ఏడాది నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో దివ్యాంగుల కోటాలో విజయావడకు చెందిన మారుతీ పృథ్వీ సత్యదేవ్ 170వ ర్యాంకు సాధించారు. తనకు ఇంటర్మీడియట్ బోర్డు సర్టిఫికేట్ అప్లోడ్ విషయంలో సమస్య తలెత్తింది. సత్యదేవ్కు వచ్చిన ర్యాంకు ప్రకారం చెన్నై ఐఐటీలో సీటు రావాల్సి ఉంది. దివ్యాంగ విద్యార్థులకు మినహాయింపు పొందిన సబ్జెక్టుకు సంబంధించి సర్టిఫికెట్లో ఇంటర్మీడియట్ బోర్డు వారు 'E' అని మాత్రమే పేర్కొంటూ జారీచేస్తున్నారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటర్మీడియట్ మెమో సర్టిఫికెట్ను అప్లోడ్ చేయగా మెమోలో కేవలం 4 సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయని, మ్యాథ్స్-ఎ, మ్యాథ్స్-బిలను ఒకే సబ్జెక్ట్గా పరిగణిస్తున్నామని, అందువల్ల ఇంటర్మీడియట్ పత్రాన్ని అంగీకరించబోమని సమాచారమిచ్చారు.
దీనిపై సత్యదేవ్ ఐఐటీ మద్రాసును సంప్రదించగా, సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్టుకు సంబంధించిన సర్టిఫికెట్లో 'ఇ' స్థానంలో నిర్దిష్ట సంఖ్యా విలువను కలిగి ఉంటేనే కళాశాలలో ప్రవేశానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని మంత్రి లోకేశ్ దృష్టికి వాట్సాప్ ద్వారా తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన లోకేశ్ సంబంధిత విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్ మార్కుల లిస్టులో దివ్యాంగ విద్యార్థుల సమస్య పరిష్కారానికి ప్రత్యేక జీవో విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ప్రభుత్వ చొరవతో సీట్లు పొందిన దివ్యాంగ విద్యార్థులను ఉండవల్లిలోని తన నివాసంలో లోకేశ్ కలిసి అభినందించనున్నారు.