త్వరలోనే కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం : ఎమ్మెల్యే దానం - MLA DANAM FIRES ON KCR
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Jul 12, 2024, 2:18 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-07-2024/640-480-21932512-thumbnail-16x9-danam.jpg)
MLA Danam Nagendar Slams BRS Party : మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేత కేటీఆర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ కార్పొరేట్ కార్యాలయంలా నడిపారని మండిపడ్డారు. కేసీఆర్ను కలవాలంటే అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదన్నారు. ఒక వేళ దొరికినా గంటల తరబడి వేచి ఉంచేవారని తెలిపారు. త్వరలోనే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనం కాబోతోందని దానం జోస్యం చెప్పారు.
హిమాయత్నగర్లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారని దానం నాగేందర్ విమర్శించారు. అందుకే విలువలేని చోట ఉండలేక కాంగ్రెస్లో చేరుతున్నారని వెల్లడించారు. హస్తం పార్టీలో అందరికీ విలువ ఉంటుందని చెప్పారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఉండేదని కేసీఆర్ హాయంలో నియోజకవర్గం అభివృద్ధి చేద్దామంటే అసలు నిధులు లేవని ఆరోపించారు. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కేటీఆర్ బినామీలు వేలకోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. చివరకు బీఆర్ఎస్లో పార్టీలో నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని అన్నారు.