LIVE : మేడారం నుంచి ప్రత్యక్ష ప్రసారం
Published : Feb 23, 2024, 9:24 AM IST
|Updated : Feb 23, 2024, 8:55 PM IST
Medaram Jatara 2024 Live : మేడారం జాతర మూడో రోజు అత్యంత కోలాహలంగా సాగుతోంది. భక్తకోటి జయజయధ్వానాల మేడారం మార్మోమోగుతోంది. మొదటి రోజు కీలక ఘట్టమైన సారలమ్మ ఆగమనం నేపథ్యంలో వనం మొత్తం జనంతో నిండిపోయింది. కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారిని ఆదివాసీ పూజారులు డోలు వాయిద్యాలతో తోడ్కొని వచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. పగిడిద్దరాజు, గోవిందరాజులనూ గద్దెలపై కొలువుదీర్చారు. రెండో రోజు మేడారం గద్దె మీదికి సమ్మక్క చేరుకున్నారు. చిలకలగుట్ట నుంచి అమ్మవారు వనం వీడి జనం మధ్యలోకి వచ్చారు. ఆమె రాకతో మేడారం పరిసరాలు మార్మోగాయి. భక్తులు జై సమ్మక్క అంటూ జయజయధ్వానాలు చేశారు.
గద్దెలపై కొలువుదీరిన అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు తండోప తండాలుగా తరలివస్తున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, పసుపు, కుంకమలు, గాజులు, చీర సారె వనదేవతలకు సమర్పిస్తున్నారు. బంగారాన్ని కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారంలోని జంపన్నవాగు, చిలకలగుట్ట, నార్లపూర్ తదితర ప్రాంతాల్లోని చెట్ల కింద విడిది చేస్తున్నారు. అనూహ్యంగా పెరిగిన భక్తులతో మేడారంలోని ప్రధాన దారులన్నీ వాహనాలతో కిక్కిరిసి పోయాయి. ఆలయ పరిసరాలు అమ్మవార్ల నామస్మరణతో మార్మోమోగుతున్నాయి.