Manda Krishna Fires on YSRCP Govt : ఎస్సీ వర్గీకరణకు సీఎం జగన్ కట్టుబడిలేరనేలా ఆయన వైఖరి ఉందని ఎమ్మార్పీఎస్ (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. కోనసీమ జిల్లా రావులపాలెంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులతో ఎస్సీ వర్గీకరణపై ఆయన చర్చించారు. మాదిగలంతా గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటు వేస్తే ఎస్సీలకు సీఎం చేసిందేమీ లేదన్నారు. కనీసం సమస్యలు చెప్పుకుందామన్నా అపాయింట్మెంట్ ఇవ్వలేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఎస్సీవర్గీకరణకు అంగీకరించిన వారికే తమ మద్దతని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డికి ఉన్న లక్షణాల్లో ఒక్కటి కూడా జగన్కు లేదన్నారు. జగన్ ఎంపీగా (MP) ఉన్నప్పుడు షెడ్యూల్ కులాల రిజర్వేషన్కు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖను రాసారన్నారు. వైఎస్సార్సీపీ (YSRCP) పెట్టిన తరువాత ప్లీనరీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటామని తీర్మాణం చేశారన్నారు. ఆ నమ్మకంతో గడిచిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటు వేసి గెలిపిస్తే 5 ఏళ్ల కాలంలో ఏనాడు వర్గీకరణకు అనుకూలంగా చర్యలు తీసుకోలేదన్నారు.