వినూత్నంగా దేవీ మండపం - మత్తు వదలరా అంటూ ప్లెక్సీల ఏర్పాటు - SHARANNAVARATHIRI CELEBRATIONS
Published : 2 hours ago
Sharannavarathri At Dubbaka : సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నేటి యువతలో డ్రగ్స్ అనర్థాలపై చైతన్యం తీసుకురావడంతో పాటు భక్తి భావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో వినూత్న ఆలోచనకు ముందు అడుగు వేశారు. అమ్మవారి మండపం వద్ద "యువత మేలుకో - డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం" అంటూ మండపం వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మత్తుకు బానిసై నేటి యువత జీవితాలు చిత్తు చేసుకుంటున్నారనే ఉద్దేశంతో వినూత్న ఆలోచనతో డ్రగ్స్పై అవగాహన కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కలుగుతుందని చెబుతున్నారు. అమ్మవారి దయతో రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ మహమ్మారి యువత నుంచి దూరం కావాలని స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు ఆకాంక్షించారు. దీంతో యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ భక్తులు, ప్రజలు, అధికారులతో పాటు పోలీసుల మన్ననలు సైతం అందుకుంటున్నారు.