పోలవరం క్రస్ట్ గేట్లను తాకిన గోదారమ్మ- 43 వేల క్యూసెక్కుల నీటి విడుదల - water level at Polavaram project
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 2, 2024, 3:38 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-07-2024/640-480-21849362-thumbnail-16x9-godavari-water-level-will-rise-at-polavaram-project3.jpg)
Godavari Water Level Will Rise at Polavaram Project : పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు నుంచి 43 వేల క్యూసెక్కుల వరద విడుదల చేస్తున్నారు. అలాగే ఎగువన గోదావరి నీటిమట్టం సైతం అనూహ్యంగా పెరిగింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు కొండవాగులు, ఉపనదుల జలాలు గోదావరిలో కలుస్తుండడం వల్ల గోదావరి నీటిమట్టం పెరిగిపోయి 48 క్రస్ట్ గేట్ల ద్వారా నీరు దిగువకు ప్రవహిస్తోంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ఎగువన 26.290, స్పిల్ వే దిగువున 16.350, ఎగువ కాపర్ డ్యాంకి ఎగువన 26.350, దిగువ కాపర్ డ్యాంకి దిగువన 15.130 మీటర్ల నీటిమట్టం నమోదైంది. అదనంగా వస్తున్న 43,878 క్యూసెక్కుల వరదను విడుదల చేసినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
అయితే పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద సోమవారం సాయంత్రానికి నీటి మట్టం 26 మీటర్లకు చేరింది. 25.72 మీటర్ల స్థాయిలో క్రస్టు గేట్లు ఉన్నాయి. వరద ప్రవాహం పెరగడంతో 48 క్రస్టు గేట్ల నుంచి నీరు స్పిల్ ఛానల్ మీదుగా తిరిగి గోదావరిలో కలుస్తోంది. సోమవారం వరకు రివర్ స్లూయిజ్ గేట్ల ద్వారా దిగువకు వెళ్తున్న నీరు ప్రస్తుతం క్రస్టు గేట్ల స్థాయి దాటి ప్రవహిస్తోంది. దాంతో ఎగువ, దిగువ కాఫర్డ్యాంల మధ్య నీటి ప్రవాహం పెరుగుతోంది.