By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 9, 2024, 12:33 PM IST
పులిచింతలకు కొనసాగుతున్న వరద - 11 గేట్లు ఎత్తి నీటి విడుదల - FLOOD FLOW TO PULICHINTALA
Flood Water Release From Pulichintala Project : పులిచింతల ప్రాజెక్టుకు నాగార్జున సాగర్ నుంచి వరద కొనసాగుతోంది. జలాశయానికి ఎగువ నుంచి 2.42 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 11 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు వస్తున్న నీటి నుంచి 2 లక్షల 30 వేల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇందులో విద్యుత్ ఉత్పత్తి కోసం 12 వేల క్యూసెక్కుల నీటిని మళ్లించినట్లు పేర్కొన్నారు. మిగతా నీటిని గేట్లు ఎత్తి ప్రకాశం బ్యారేజీకి పంపిస్తున్నారు. పులిచింతల జలాశయం పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 31.84 టీఎంసీలు ఉంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రస్తుత నీటి మట్టాల్ని అలాగే కొనసాగిస్తూ ఎగువ నుంచి వస్తున్న నీటిని వచ్చినట్లు దిగువకు పంపిస్తున్నారు. వరద తగ్గు ముఖం పట్టాక ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో నింపనున్నట్లు అధికారులు తెలిపారు.