By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 16, 2024, 5:09 PM IST
వైఎస్సార్సీపీ హయాంలో అన్యాక్రాంతమైన భూములు పేదలకు కేటాయించాలి: సీపీఎం - land irregularities in ycp govt
CPM State Secretary Srinivasa Rao Demands : గత వైఎస్సార్సీపీ హయాంలో అన్యాక్రాంతమైన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాస రావు డిమాండ్ చేశాారు. ఆ భూములను పేదలకు ఇవ్వాలని కోరారు. అలాగే అసైన్డ్ లాండ్ సవరణ జీఓ 596ను రద్దు చేయాలన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లలో రెండు లక్షల ఎకరాలకు పైగా భూములను సెజ్, పరిశ్రమలు, ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో సేకరించారని తెలిపారు. ఇంత వరకు ఆ భూములలో ఒక్క పరిశ్రమ పెట్టలేదని విమర్శించారు.
ఏలూరు, కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాలలో వేలాది ఎకరాలుగా ఉన్న అసైన్డ్ భూములను కొంతమంది పెత్తందార్లు, మాజీ ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని మండిపడ్డారు. వాటన్నింటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాటి యాజమానులకు అప్పగించాలని కోరారు. ఈ భూ అక్రమాలపై న్యాయ విచారణ చేపట్టాలన్నారు. అలాగే వ్యవసాయానికి ఉచిత భీమా, విద్యుత్ కొనసాగించాలన్నారు. గతంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్లను తీసేయాలని డిమాండ్ చేశారు. రెండోసారి దిల్లీకి వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, విభజన హామీలు, విశాఖ ఉక్కు, ప్రత్యేక హోదా అంశాలపై హామీ తీసుకోవాలని కోరారు.