మల్లికార్జున స్వామి ఆలయం వద్ద ఉద్రిక్తత - పరస్పర దాడికి దిగిన ఒగ్గు పూజారులు - Clash Between Two Priest Groups - CLASH BETWEEN TWO PRIEST GROUPS
🎬 Watch Now: Feature Video


Published : Mar 21, 2024, 12:17 PM IST
Clash Between Two Priests In Rekulakunta Mallanna Temple : సిద్దిపేట జిల్లా దుబ్బాక రేకులకుంట మల్లికార్జున స్వామి ఆలయం వద్ద ఇరువర్గాల ఒగ్గు పూజారులు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 15 మంది పూజారులు గాయపడ్డారు. కొన్నేళ్లుగా ఆలయంలో పట్నాలు, ఇతర పూజలను చెరుకూరి వర్గంలోని 26 మంది, కోటి వర్గంలో 22 మంది, పయ్యావుల వర్గంలో 10 మంది నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ సూచనతో మరో 10 మందిని పయ్యావుల వర్గంలో ఒగ్గు పూజారులుగా ఈనెల 9న ఆలయ ఈవో మోహన్ రెడ్డి నియమించారు. దీనిపై చెరుకూరి, కోటి వర్గాలు కోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చాయి.
వారం రోజులుగా ఈ వ్యవహారంపై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న పయ్యావుల వర్గంపై మిగిలిన రెండు వర్గాలు కర్రలు, రాళ్లతో దాడి చేయగా వారు ప్రతిదాడికి దిగారు. భక్తులు, అధికారులు భయభ్రాంతులకు గురయ్యారు. రెండు వర్గాలకు చెందిన 15 మంది ఒగ్గు పూజారులు, ఇతరులు గాయపడ్డారు. దుబ్బాక ఎస్సై గంగరాజు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని వారిని శాంతింపజేశారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.