'బుడమేరు తాకిడికి 48వేల వాహనాలకు నష్టం- బాధితులు దరఖాస్తు చేసుకోవాలి' - Meeting with Bankers and Insurance
By ETV Bharat Andhra Pradesh Team
Published : 3 hours ago
Meeting with Bankers and Insurance : బుడమేరు వరదల వల్ల దాదాపు 48 వేల వాహనాలు పాడైనట్లు ఏపీ ఆర్ధిక శాఖ అదనపు కార్యదర్శి జె.నివాస్ తెలిపారు. విజయవాడ కలెక్టరేట్ లో బ్యాంకర్లు, వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. దాదాపు 40 శాతం వాహనాలకు ఇప్పటికే ఇన్సూరెన్స్ చెల్లింపులు పూర్తయ్యాయన్నారు. మిగిలిన వాహనాలకు కూడా త్వరితగతిన ఇన్సూరెన్స్ చెల్లించాలని కంపెనీలను ఆదేశించామని తెలిపారు. బాధితులు ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఇంకా ఇన్సూరెన్స్ చెల్లించని కంపెనీలతో మాట్లాడామని నివాస్ వెల్లడించారు. చిన్న చిన్న రిపేర్లు ఉన్న వాహనాల క్లెయిమ్లు మరో మూడు రోజుల్లో పూర్తి అవుతాయని వెల్లడించారు. ఎలక్ట్రికల్ వాహనాలకి బ్యాటరీలను మార్చాలి, అందుకూ సమయం పట్టే అవకాశం ఉందన్నారు. బాధితులకు పరిహారంతో పాటు బ్యాంకుల ద్వారా ఏ విధంగా ఆదుకోవాలో ఆలోచించామని, అందులో భాగంగానే వారితో సమావేశాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఎమ్ఎస్ఎంఈ (MSME) కంపెనీలు తీసుకున్న రుణాలను వెంటనే రీ షెడ్యూల్ చేయాలని బ్యాంకర్లను ఆదేశించామని తెలిపారు. అలాగే రైతులకు కూడా లోన్లు రీ షెడ్యూల్ చేయాలని ఆదేశించినట్లు ఆర్ధిక శాఖ ఆదనపు కార్యదర్శి జె.నివాస్ వెల్లడించారు.