Disappearing Wedding Traditions : పిన్నీ మా ఇంట్లో పెళ్లి పందిరి వేస్తున్నాం మీరందరూ తప్పక రావాలి. ఎక్కడికి వెళ్లొస్తున్నావు అక్కా? పక్క వీధిలో రామాయమ్మ కుమార్తెను పెళ్లికూతురిని చేసి వస్తున్నాం. పేరాంటాళ్లు ఎక్కడికెళ్లారే. పెళ్లికుమారుడి మంగళస్నానానికి బావి దగ్గరికి వెళ్లి నీళ్లు తోడుకురావాలి. వీధిలోకి వెళ్లి అందరినీ కత్తిపీటలు తీసుకొని కూరగాయలు కొయ్యడానికి పిలవండర్రా వదినా! బియ్యం నూక ఉప్మా అయినా ఎంత రుచిగా ఉందో.
ఇంట్లో చేసుకుంటే ఇంత రుచి రాదెందుకే? బావా సాంబారు ఇంకాస్త పొయ్యనా? మరదలు పిల్లా సాంబారు వడ్డించడమేనా? నువ్వు పప్పన్నం పెట్టేదుందా? ఇలాంటి మాటలు ఇప్పుడు జరుగుతున్న పెళ్లిల్లో వినిపించడం లేదు. ఏవండీ సాయంత్రం మన ఊరి ఫంక్షన్ హాల్లో మా బాబాయి కుమార్తె రిసెప్షన్ ఉంది. త్వరగా వస్తే గిఫ్ట్ ఇచ్చి ఫొటో దిగి తినేసి వచ్చేద్దాం ఇలాంటి పిలుపులే ఇప్పుడు వినిపిస్తున్నాయి.
పట్టణాల్లో ఫంక్షన్ హాళ్లలో వివాహాలు జరగడం అనేది ఎప్పటినుంచో జరుగుతున్నదే. కానీ ప్రస్తుతం గ్రామాల్లో కూడా పెళ్లిళ్లు ఇళ్లముందు జరగడం లేదు. మండల కేంద్రంలో లేక సమీప పట్టణాల్లోని కల్యాణ మండపాలను బుక్ చేసుకుని నిర్వహిస్తున్నారు. పలు గ్రామాల్లో కూడా సౌకర్యాలతో కూడిన కల్యాణ మండపాలు అందుబాటులో ఉన్నాయి. దగ్గర బంధువులు ఆ ముహూర్తం సమయానికి వచ్చి అక్షింతలు వేసి ఫొటోకి పోజిచ్చి రెండు మెతుకులు తినేసి పోతున్నారు.
Outdated Wedding Traditions : మనుషులు ఎంత బిజీ అయిపోయారంటే ఒక ఇంట్లో జరగాల్సిన నిశ్చితార్థం కూడా ఫంక్షన్ హాళ్లో జరిపిస్తున్నారు. అసలు పెళ్లిచూపులే ఉండడం లేదు. అవీ ఆన్లైన్లో జరుగుతున్నాయంటే నమ్మగలరా? కల్యాణ మండపంలో వివాహం చేసినా ఇంటిముందు పందిరి వేయడం సంప్రదాయం. దీన్ని పాటించే వారు అరుదు. కల్యాణ మండపం బుక్ చేసుకున్న దగ్గర నుంచి భోజనాలు, డెకరేషన్, మంగళస్నానం చేయించడం అన్నీ ఎవరికో గుత్తేదారులకు అప్పగిస్తున్నారు.
బంధువులే వధూవరులకు మంగళస్నానాలు చేయించాలి. కానీ దీన్ని కూడా ఈవెంట్స్ వారికి అప్పగిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యం పేరంటాళ్లు. పెళ్లిలో హడావుడి అంతా వీరిదే. పెద్దవాళ్లు ఎవరైనా పెళ్లికి వచ్చి ఇక్కడ పేరంటాళ్లు ఎవరమ్మా అని అడిగితే అలాంటివాళ్లు ఎవరూ ఉండరు ఈవెంట్స్ వాళ్లే అన్నీ చూసుకుంటారు అని సమాధానమిస్తున్నారు.
పేరాంటాళ్లుగా ఉండడం అదృష్టం : మా వీధిలో ఏదైనా పెళ్లి జరిగితే మూడురోజులపాటు మా ఇంటి పొయ్యి వెలిగించమని పల్నాడు జిల్లా లింగంగుట్లకు చెందిన నూతక్కి ఈశ్వరి తెలిపారు. అన్ని పనులు వీధిలో మహిళలంతా కలిసి చేసేవాళ్లమని చెప్పారు. అసలు పేరాంటాళ్లుగా ఉండే అవకాశం రావడం ఎంతో అదృష్టంగా భావించేవారమని పేర్కొన్నారు.
పెళ్లంటనే బంధువుల సందడి : ఇప్పటి పెళ్లి వేడుకలో బంధువుల సందడి కంటే ఈవెంట్ వారి హడావుడే ఎక్కువైపోతోందని చింతపల్లికి చెందిన రాచకొండ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. అదేంటో నాలుగైదు రోజులు ఈవెంట్స్ వారు తిష్ఠ వేస్తున్నారని చెప్పారు. బంధువులేమో పెళ్లి ముహూర్తానికి వచ్చిపోతున్నట్లు తెలిపారు. ఆప్యాయ పలకరింపులు కొరవడుతున్నాయని అన్నారు.
మోగనున్న పెళ్లి బాజాలు - పంచాంగకర్తలు చెప్పిన శుభముహూర్తాలు ఇవే!