Vyjayanthi Novel Launch Event : "వైజయంతి విహారి-జగన్నాథ పండితరాయలు" గ్రంథావిష్కరణ సభ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. రవీంద్రభారతి సమావేశ మందిరంలో ఎంవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సుధామ సృజనకర్తగా పేరుగాంచిన విహారి సంపాదకత్వంలో తీర్చిదిద్దిన 'సప్తశతి' (సప్తపదుల కవితా సంకలనం)తో పాటు ఆయన స్వయంగా రచించిన 'వైజయంతి'(జగన్నాథ పండితరాయలు) నవలా సమాలోచన ఆవిష్కరణ సభ జరిగింది. ప్రభుత్వ మాజీ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి డా.కె.వి.రమణాచారి ఈ 2 పుస్తకాలను ఆవిష్కరించారు.
యాభై ఏళ్ల తపస్సు : పుస్తకాల ఆవిష్కరణ అనంతరం విశ్రాంత ఐఏఎస్ కేవీ రమణాచారి మాట్లాడుతూ వైజయంతి నవల ఊహాత్మకమే అయినప్పటికీ విహారి 50ఏళ్లు శోధించి రాశారని ప్రశంసించారు. తానూ పదేళ్లు ప్రభుత్వంలో సాంస్కృతిక శాఖకు సలహాదారుగా ఉన్నానని రమణాచారి గుర్తుచేసుకున్నారు. ఈ రోజుల్లో ప్రభుత్వ సలహాదారుగా ఉండటమంటే పాముతో చెలగాటమాడినట్లేనని, పాము పడగ నీడలో కప్ప ఉన్నట్లుగా ఉంటుందన్నారు. సలహాదారుగా చాలా ఆచితూచి వ్యవహారించాల్సి ఉంటుందని వ్యక్తీకరించారు.
"సాహిత్యంలో స్వేచ్ఛగా విహరించే కథరాజు మా విహారి అని నేను అంటుంటాను. ఈరోజు సభ ప్రాంగణంలో కూడా తను తనకు నచ్చిన విధంగా విహరిస్తూనే ఉన్నారు. ఒక పుస్తకం ఆవిష్కరింపబడిందా లేదా అనే ఆలోచనను కలిగిస్తున్న సందర్భమిది. పండితరాయలు అనే నవల సాహితీ లోకంలో విహరిస్తూ ఉంది." -కేవీ రమణాచారి, రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు
పండిత జగన్నాథరాయలు 17వ శతాబ్దంలో పండిత బ్రాహ్మణుడై కూడా, మొఘల్ చక్రవరి జహంగీర్ వద్ద సలహాదారుగా ఉండి 'పండితరాయలు' అని బిరుదు పొందారని రమణాచారి కీర్తించారు. జహంగీర్ కంటే ఆయన భార్య నూర్జహాన్ జగన్నాథరాయలును గౌరవించేవారని, మహారాణి అయినప్పటికీ ఆయన మాటలు శిరసా వహించేవారని న్నారు.
జహంగీర్ తరువాత ఆయన కుమారుడు షాజహాన్ సైతం పండితరాయల్ని సత్కరించారని చరిత్రను గుర్తు చేశారు. ఆ సమయంలో తన సింహాసనంలో అర్థభాగమిచ్చి గౌరవించారంటే జగన్నాథరాయులు ఎంత గొప్పవాడో అర్థమవుతోందని అన్నారు. చరిత్ర మరుస్తున్న ప్రస్తుత సమయంలో ఇలాంటి చారిత్రక నవలలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
తన 50 ఏళ్ల కృషికి అక్షరరూపమే వైజయంతి అని రచయిత విహారి ఉద్ఘాటించారు. ఈ ప్రయత్నంలో తనకు సహకరించిన వారందరికి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. కేవీ రమణాచారి గారు ముందుమాట రాసినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
"జగన్నాథ పండితరాయలు నవల యాభై ఏళ్ల కృషి. కృషి అంటే రాస్తూ కూర్చోలేదు. నా కుటుంబ సభ్యులకు తెలుసు, నేను ఆ నవల కోసం కృషి చేశానని. ముందు కావ్యం రాయాలనుకున్నాను. సగం రాసి వదిలేశాను. తరువాత మరో ప్రయత్నంగా గేయకావ్యం రాద్దామని అదీ ఆపేశాను. ఆ తర్వాత నవలగా వచ్చింది" -విహారి, వైజయంతి పుస్తక రచయిత