Variety Ganesh Idols In Warangal : విఘ్నాలు తొలగించే వినాయకుడి పండుగ వచ్చిందంటే చాలు రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. చిన్నాపెద్దా అనే తారతమ్యం లేకుండా అందరూ గణనాథుల మండపాల ఏర్పాట్లలో నిమగ్నమైపోతారు. ఇందులో భాగంగా వరంగల్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు ఓ వైపు పర్యావరణానికి ప్రాధాన్యమిస్తూనే మరోవైపు సందేశాత్మకంగా పలు ఆకృతులలో ఏకదంతుడ్ని ఏర్పాటు చేసి పూజిస్తున్నారు.
మర్రిఊడలు, వేపచెట్టు బెరడుతో వినాయకుడు : పర్యావరణం పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యంగా వరంగల్కు చెందిన గణేష్ ఉత్సవ సమితి సభ్యులు నడుబిగించారు. గతానికి భిన్నంగా వినాయక చవితి వేడుకలను నిర్వహిస్తున్నారు. వరంగల్ నగరంలోని కొండురు వీధికి చెందిన కాకతీయ గజానన మండలి సభ్యులు పర్యావరణంపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంలో మర్రి ఊడలు, వేప చెట్టు బెరడుతో ఏర్పాటు చేసిన ఏకదంతుడిని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు.
గత ఐదేళ్లుగా మట్టి గణపతిని ఏర్పాటు చేస్తున్నామని నిర్వహకులు తెలిపారు. రామన్నపేటకు చెందిన ఉత్సవ సమితి సభ్యులు ఏకంగా పోకచెక్కలతో వినాయకున్ని ఏర్పాటు చేశారు. ఇందుకు గాను 12 కిలోల నలుపు రంగు వక్కలను 4 కిలోల తెలుపు రంగువి ఉపయోగించారు. బెంగాలీ కళాకారులు 15 రోజుల పాటు శ్రమించి విగ్రహం తయారు చేసినట్లుగా నిర్వాహకులు తెలిపారు.
భక్తుల పూజలందుకుంటున్న డ్రైఫ్రూట్స్తో చేసిన గణపతి : ఇది ఇలావుంటే ప్రతిఏటా భిన్నంగా దర్శనం ఇచ్చే గీతాభవన్ వినాయకుడు ఈసారి మరో అవతారంలో దర్శనమిచ్చారు. ఎరుపు, తెలుపు, పింక్ వర్ణంతో కూడిన గులాబీలతో దర్శనం ఇచ్చారు. ఒడిశాకు చెందిన 8 మంది కళాకారులు నెల రోజుల పాటు కష్టపడి ఈ పార్వతీ తనయున్ని తయారు చేసిన్నట్లుగా తెలిపారు.
పటక్ చమన్ వద్ద ఏర్పాటు చేసిన భారీ శివలింగం సెట్ నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంది. శివలింగం లోపలి భాగంలో పసుపు, ఆకుపచ్చ బఠానీలతో గణనాథున్ని ప్రతిష్ఠించారు. 18కిలోల పసుపు బఠాణీ, 15 కిలోల ఆకుపచ్చ బఠాణీతో పాటు మరో 8 కిలోల తెలుపు బఠాణీని ఇందుకు ఉపయోగించారు. ఏకదంతుని ముఖాన్ని మాత్రం 6కిలోల బాదంతో రూపొందించిన్నట్లు నిర్వాహకులు తెలిపారు. గత పదిసంవత్సరాలుగా మట్టి గణపతి ఏర్పాటు చేస్తున్నామని మూడేళ్లుగా విభిన్న ఆకృతుల్లో విగ్రహలను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Hotel Setting Ganesh Idol : అకట్టుకుంటోన్న సెట్టింగ్.. కను'విందు' చేస్తోన్న గణేశుడు