AP Liquor Shops Tenders Update : ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం భారీగా దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. అప్లికేషన్ల గడువు ఇవాళ్టితో ముగియనుందని ఎక్సైజ్శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్ తెలిపారు. శుక్రవారం రాత్రి 7గంటల వరకు ఆన్లైన్లో నూతన రిజిస్ట్రేషన్కు అవకాశం ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్ తదుపరి రాత్రి 12 గంటల్లోగా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలన్నారు. బ్యాంకు డీడీలతో నేరుగా ఎక్సైజ్ స్టేషన్లలో అప్లికేషన్లు సమర్పించేవారు రాత్రి 7గంటల్లోపు క్యూలైన్లో ఉంటేనే అవకాశం ఉంటుందన్నారు.
ఎక్సైజ్ స్టేషన్ల వద్ద క్యూలైన్లో ఉన్నవారికి మాత్రమే టోకెన్లు అందించి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. దరఖాస్తుదారులు రూల్స్ పాటించి కార్యక్రమం సజావుగా ముగిసేలా సహకరించాలని కోరారు. 3,396 మద్యం దుకాణాలకు ఇప్పటివరకూ 65,424 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. దరఖాస్తుల ద్వారా ఏపీ సర్కార్కు రూ.1,308 కోట్ల ఆదాయం సమకూరిందని నిషాంత్కుమార్ తెలిపారు.
'మద్య'వర్తుల రాయ'బేరం' : మరోవైపు అయిదేళ్ల తర్వాత అమల్లోకి వచ్చిన కొత్త లిక్కర్ పాలసీ వ్యాపారుల్లో కిక్కు పెంచింది. లాటరీలో మద్యం షాపులు ఒకటి తగిలితే చాలు పరపతి పెంచుకోవచ్చనేది చాలా మంది ఆలోచన. ఆ అవకాశం దక్కించుకోవడానికి పొలిటికల్ లీడర్ల నుంచి దిగువస్థాయి దళారుల వరకు ప్రస్తుతం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. వ్యాపార కోరిక, రాజకీయ కాంక్షల మధ్య మధ్యవర్తులు రాయబారం నడుపుతున్నారు.
నేతల వారసుల జోక్యం : పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేల వారసులు మద్యం దరఖాస్తుల విషయంలో జోక్యం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వారికి తెలియకుండా అప్లికేషన్లు చేయకూడదని హుకుం జారీ చేసినట్లు వ్యాపారులు వాపోతున్నారు. తీరప్రాంత ఎమ్మెల్యే ఒకరు కనీసం 10 లిక్కర్ షాపులు తనకు వదిలేయాలని కోరుతున్నారు. మరో నేత తన పరిధి కిందకి వచ్చే దుకాణాలన్నిట్లోనూ 20 శాతం వాటా అడుగుతున్నారని చెబుతున్నారు. 10 శాతానికైతే సరేనన్న సంకేతాలు రాయబారుల ద్వారా చేరాయి.
వడ్డీలకు డబ్బుల్లేవు : వడ్డీ వ్యాపారులు సైతం గోదావరి జిల్లాలో పదిరోజులుగా కొత్త లావాదేవీలు నిలిపేశారు. దరఖాస్తుదారులకు ఆయా మొత్తాలు మళ్లించడంతోపాటు అధిక వడ్డీలకు వ్యాపారులు అప్పులు తీసుకెళ్లడంతో లావాదేవీలు ప్రెజెంట్ నిలిచిపోయాయని పాలకొల్లుకు చెందిన ఓ వడ్డీ వ్యాపారి తెలిపారు.
మద్యం టెండర్ల మహర్దశ - కిక్కెవరికో..? లక్కెవరికో?
బాలుడి ప్రయోగం.. యూట్యూబ్ చూసి మద్యం తయారీ.. స్నేహితుడికి తాగించగానే..