తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం - క్షేత్రస్థాయిలో దర్యాప్తునకు సిద్ధమవుతున్న సిట్ - SIT INQUIRY ON TIRUMALA LADDU ISSUE
శ్రీవారి లడ్డూ వివాదంలో నిజాలు నిగ్గు తేల్చనున్న సిట్ - ఎంక్వైరీ పూర్తిగా తిరుపతి నుంచి చేపట్టేందుకు ఏర్పాట్లు


Published : Nov 16, 2024, 8:31 PM IST
SIT Inquiry on Tirumala Laddu Issue : కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై క్షేత్రస్థాయిలో దర్యాప్తునకు సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) సిద్ధమైంది. 5 సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయగా తాజాగా బృందానికి సహాయ సహకారాలు అందించేందుకు మరో 30 మంది సిబ్బందిని తీసుకున్నారు. ఎంక్వైరీ పూర్తిగా తిరుపతి నుంచి చేపట్టేందుకు అనుగుణంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన గెస్ట్హౌజ్ను కేటాయించాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోరారు.
తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఎన్డీడీబీ పరీక్ష నివేదికలో బయటపడిన అంశంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేయనుంది. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సీబీఐ నుంచి ఇద్దరు అధికారులతో పాటు రాష్ట్రం నుంచి ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి మరో అధికారి ప్రత్యేక బృందంలో నియమితులయ్యారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజి డీఐజీ గోపీనాథ్ జెట్టీ ఉన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) తరఫున హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు, విశాఖపట్నం ఎస్పీ మురళి రాంబాతో పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ (నాణ్యత హామీ) సలహాదారు డాక్టర్ సత్యేన్కుమార్ పాండా ఉన్నారు.
సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో : సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పని చేయనుంది. వీరంతా తిరుమలకు వచ్చి మొత్తం అక్రమాలను నిగ్గు తేల్చేందుకు చర్యలు చేపడతారు. మొత్తం 4 డీఎస్పీలు, 8 మంది సీఐలు, 2 ఎస్సైల సేవలను సిట్ వినియోగించుకోనుంది. వీరితో పాటు మరికొంత మంది మినిస్టీరియల్ సిబ్బంది అవసరం ఉందని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరింది. సిట్ విజ్ఞప్తి మేరకు సర్కార్ సిబ్బందిని కేటాయించనుంది.
రంగంలోకి దిగనున్న సిట్ బృందం : సిట్ బృందం సభ్యులకు వసతితో పాటు ప్రత్యేక ఆఫీస్ను ఏర్పాటు చేయాల్సిందిగా సీబీఐ ఆఫీసర్స్ టీటీడీని కోరారు. కంప్యూటర్లతో పాటు ప్రింటర్లు, రికార్డులు భద్రపరిచేందుకు వీలుగా ప్రత్యేక గది, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించుకునేందుకు అనుగుణంగా భవనాలను కేటాయించాలని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సీబీఐ కోరింది. ఎంక్వైరీ పూర్తయ్యేవరకు కార్యాలయం నుంచే సిట్ తమ విచారణ నిర్వహించనుంది. కార్యాలయం కోసం భవనాలను కేటాయించాలని కోరుతూ టీటీడీకి సీబీఐ లేఖ రాయడంతో అధికారులు అందుకు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. మొత్తంగా సిట్ అధికారులు త్వరలోనే పూర్తిస్థాయిలో రంగంలోకి దిగి వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సిద్ధమయ్యారు.
యాదాద్రి 'లడ్డూ' రిజల్ట్స్ వచ్చేశాయ్ - స్వచ్ఛత పరీక్షల్లో ఏం తేలిందంటే?