Private Travels Bus Stop : కుంభమేళా వెళ్లేందుకు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో టికెట్ బుక్ చేసుకున్న కొంతమంది ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. డ్రైవర్ బస్సును రోడ్డుపై వదిలేసి వెళ్లిపోవడంతో భక్తులంతా దిక్కుతోచని స్థితిలో రహదారిపైనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. మేడ్చల్ జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లేందుకు బెంగళూరు, కర్నూలు, హైదరాబాద్కు చెందిన పలువురు ప్రయాణికులు ధనుంజయ ట్రావెల్స్ అనే ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో టికెట్లు బుక్ చేసుకున్నారు. బెంగళూరు నుంచి వస్తున్న ఆ బస్సు హైదరాబాద్ మెహిదీపట్నం చేరుకోగానే రిపేర్ రావడంతో, ట్రావెల్స్ యాజమాన్యం మరో బస్సును ఏర్పాటు చేసి అందరినీ అందులోకి మార్చింది.
అయితే తాము స్లీపర్ బస్సు బుక్ చేసుకుంటే, ఇప్పుడు మినీ స్లీపర్ బస్సు ఏర్పాటు చేశారని, అందులోనూ తగినన్ని సీట్లు లేవని ప్రయాణికులు బస్సు డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే మేడ్చల్ వద్ద డ్రైవర్ బస్సును నిలిపివేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దాంతో దాదాపు 3 గంటల పాటు జాతీయ రహదారిపైనే వేచి ఉన్న భక్తులు, చేసేదేమీ లేక చివరకు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆరా తీయగా, చిన్న పిల్లలు, మహిళలతో రోడ్డుపై వేచి ఉన్నామని, గంటలు గడుస్తున్నా ట్రావెల్స్ యాజమాన్యం సరైన పరిష్కారం చూపలేదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ధనుంజయ ట్రావెల్స్కు చెందిన ఈ బస్సు బెంగళూరు నుంచి ప్రయాగ్రాజ్కు వెళ్తుంది. మేం ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుని కర్నూల్లో బస్సు ఎక్కాం. మధ్యలో రిపేర్ రావడంతో మెహిదీపట్నంలో మమ్మల్ని మరో బస్సులోకి మార్చారు. అయిమే మేం స్లీపర్ బస్సు బుక్ చేసుకుంటే, సెమీ స్లీపర్ బస్సు ఏర్పాటు చేశారు. అందులోనూ అందరికీ సీట్లు లేవు. ఇదే విషయంలో కొంతమంది ప్రయాణికులు డ్రైవర్ను ప్రశ్నించారు. దాంతో అతడు మేడ్చల్ వద్ద బస్సు నిలిపి వెళ్లిపోయాడు. గంటలు గడుస్తున్నా, యాజమాన్యం సరైన పరిష్కారం చూపలేదు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. - బాధిత ప్రయాణికులు
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును చూసి ప్రయాణికులంతా షాక్ - ఎందుకంటే?