New Teacher Postings Today in Telangana : డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న కొత్త టీచర్లకు కాసేపట్లో పోస్టింగులు ఇవ్వనున్నారు. మొత్తం 10,006 మందికి విద్యాశాఖ అధికారులు ఈ పోస్టింగులు ఇస్తారు. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఉదయం నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ ప్రకియను వాయిదా వేసినట్లు ప్రకటించారు. సాంకేతిక నిపుణులు సమస్యను పరిష్కరించడంతో తిరిగి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ అనుమతినిచ్చింది. దీంతో కాసేపట్లో పోస్టింగ్ కౌన్సెలింగ్ ప్రారంభ కానుంది. దీంతో కౌన్సిలింగ్కి వచ్చి వెనుదిరిగిన వారికి డీఈవోలు సమాచారం ఇస్తున్నారు. కొత్త ఉపాధ్యాయులు, ఆయా డీఈఓలు సూచించిన కార్యాలయాల్లో జరిగే కౌన్సెలింగ్ హాజరు కావాలి. ఎక్కువగా కలెక్టరేట్లలోనే వీటిని నిర్వహిస్తున్నారు.
ఒక్కసారిగా అవాక్కైన అభ్యర్థులు : షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఉదయమే కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదా జరగాలి. అయితే సాంకేతిక సమస్య ఏర్పడటంతో కౌన్సెలింగ్ వాయిదా వేశామని అధికారులు చెప్పడంతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ఒక్కరోజు ముందు కౌన్సెలింగ్ ఉందని సమాచారం ఇచ్చి ఉదయమే వాయిదా వేయడంతో అవాక్కయ్యారు. కౌన్సెలింగ్ కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ముందస్తు సమాచారం లేకుండా ఉన్నఫలంగా వాయిదా వేయడం పట్ల అనుమానాలకు తావిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
"నేను స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాను. ఇవాళ కౌన్సెలింగ్ ఉందని నిన్న సాయంత్రం చెప్పారు. కౌన్సెలింగ్కు అటెండ్ అవుదామని వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కౌన్సెలింగ్ లేదు వాయిదా పడిందని అడగ్గా వివిధ జిల్లాల్లో సెలెక్షన్ లిస్ట్ రాకపోవడం వల్ల , అందుబాటులోకి లేదు కావున ఇక్కడికి వచ్చాక తెలిపారు. అక్కడి నుంచి ఇక్కడి వచ్చి మా సమయం వృథా అయ్యింది. ఆ విషయం కాస్త ముందుగా చెప్తే బాగుండేది." - డీఎస్సీ ఉద్యోగస్థుడు
ఈ ఏడాది ఫిబ్రవరి 29న నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కారు జులై 18 నుంచి ఆగస్టు 5వరకు పరీక్షలు నిర్వహించింది. మొత్తం 11,062 పోస్టులకు గాను సుమారు 2లక్షల 46వేల మంది పరీక్షలు రాశారు. వీరిలో అర్హులైన వారిని ఎంపిక చేసి అక్టోబర్ 1 నుంచి 5 వరకు జిల్లా విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు. అందులో ఎంపికైన వారికి ఇవాళ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.