Narsampet BRS Councillors Resign : వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం బీఆర్ఎస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్ ఛైర్ పర్సన్ గుంటి రజనీకిషన్ ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ వైస్ ఛైర్ పర్సన్తో సహా 14 మంది గులాబీ పార్టీ కౌన్సిలర్లు రాజీనామా బాట పట్టారు. ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో మూకుమ్మడిగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖ విడుదల చేశారు.
కౌన్సిలర్ల పట్ల మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వైఖరి నచ్చక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బీఆర్ఎస్ కౌన్సిలర్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఛైర్ పర్సన్ గుంటి రజనీకిషన్ ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ ప్రవేశ పెట్టిన అవిశ్వాసం వీగిపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో పదవులకు కూడా రాజీనామా చేస్తామని పేర్కొన్నారు.
Councillors Against Municipality Chairperson : అంతకుముందు నర్సంపేట మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం ఏర్పాట్లు చేశారు. కానీ ఈ అవిశ్వాస తీర్మానానికి కౌన్సిల్ సభ్యులు హాజరుకాకపోవడంతో మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది. ఆ తరువాత కూడా కౌన్సిల్ సభ్యులెవరూ హాజరుకాలేదు. దీంతో అవిశ్వాసం వీగిపోయింది. మున్సిపల్ ఛైర్ పర్సన్ గుంటి రజనీకిషన్కు వ్యతిరేకంగా సొంత పార్టీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం తీసుకు రావాలని నిర్ణయించారు. ఈ మేరకు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ 14 మంది గులాబీ పార్టీ కౌన్సిలర్లు ఈ నెల 2న జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వగా, ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
NoConfidence Motion on BRS Chairperson : నర్సంపేట మున్సిపాలిటీలో మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా, అందులో బీఆర్ఎస్ పార్టీకి 18 మంది, కాంగ్రెస్కు ఆరుగురు కౌన్సిలర్లు ఉన్నారు. అవిశ్వాసం తీర్మానం నెగ్గాలంటే 17 మంది కౌన్సిలర్ల మద్దతు తప్పనిసరి. ఈ క్రమంలో ఛైర్ పర్సన్తో సహా ఇద్దరు కౌన్సిలర్లు కలిసి రహస్య శిబిరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు సమావేశానికి హాజరైయ్యేలా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు.
ఈ నేపథ్యంలో కౌన్సిలర్లకు విప్ను జారీ చేశారు. ఛైర్ పర్సన్ను ఎలాగైనా గద్దె దించాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ కౌన్సిలర్ల మద్దతు కోరగా వారు తిరస్కరించారు. దీంతో ఛైర్ పర్సన్ గుంటి రజనీకిషన్ ఆగడాలను పార్టీ నాయకత్వం నియంత్రించలేకపోయిందంటూ, మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బీఆర్ఎస్ కౌన్సిలర్లు తెలిపారు.
'నర్సంపేట ఛైర్ పర్సన్ గుంటి రజనీకిషన్ ఒంటెత్తు పోకడలకు వ్యతిరేకంగా మొత్తం 14 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లుగా గత సంవత్సరంలోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని నిర్ణయించాం. కానీ అప్పటి ప్రభుత్వం మూడు సంవత్సరాలకు లేదు నాలుగు సంవత్సరాలకు జీవో ఉందని తెలిపింది. దీంతో వెనక్కి తీసుకున్నాం. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా సమన్వయం చేస్తానని అవిశ్వాస తీర్మానాన్ని ఆపారు' - మునగాల వెంకటరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్
రేవంత్ సర్కార్ సరైన నిర్ణయాలు తీసుకోలేక ఊగిసలాడుతోంది : రఘునందన్ రావు
రాష్ట్రం చీకట్లో ఉండాలని కలలు కంటున్నారు - బీఆర్ఎస్పై భట్టి విక్రమార్క ఫైర్