KTR Meet With Warangal Parliament Constituency Leaders : రానున్న లోక్సభ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్, అటు భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో ఒకేసారి ఎదురుదెబ్బ తగలబోతోందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. వరంగల్తో పాటు పెద్దపల్లి పార్లమెంట్(Peddapalli Parliament) నియోజకవర్గాల పరిధిలోని పార్టీ ముఖ్యనేతలతో ఆయన హైదరాబాద్లో విడివిడిగా సమావేశమయ్యారు. వరంగల్ లో చివరి క్షణంలో కడియం శ్రీహరి కుటుంబం పార్టీకి మోసం చేసిన వ్యవహారంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పారు.
కొందరు నాయకులు వలస వెళ్లినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం లేదని, ప్రజలు, తెలంగాణ సమాజం బీఆర్ఎస్ వెంటే ఉందని కేటీఆర్ వివరించారు. వరంగల్ నుంచి పార్టీ బరిలో దింపిన సుధీర్ కుమార్(Warangal MP Candidate Sudhir Kumar) అభ్యర్థిత్వంపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్న ఆయన, అందరి ఏకాభిప్రాయంతో అభ్యర్థి ఎంపిక జరిగిందని గుర్తు చేశారు. 2001 నుంచి కేసీఆర్తో కలిసి నడిచిన సుధీర్ కుమార్ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
గెలుపే లక్ష్యంగా గులాబీ సత్తాచాటేలా : చైతన్యానికి ప్రతీకైన వరంగల్ ప్రజలు గులాబీ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లిలోనూ గులాబీ గెలుపు ఖాయమైందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో పాటు సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మచ్చలేని నాయకుడిగా బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు(Koppula Eshwar) ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని గుర్తు చేశారు. కొప్పుల ఈశ్వర్ లాంటి ఉద్యమ గొంతుకను ఎన్నుకుంటేనే పార్లమెంట్లో తెలంగాణ వాణిని బలంగా వినిపించగలుగుతారని పేర్కొన్నారు.
అన్నదాతలు మొదలు ఆటో డ్రైవర్ల వరకు ప్రజలంతా కాంగ్రెస్పై ఆగ్రహంతో ఉన్నారన్న కేటీఆర్, అసెంబ్లీ ఎన్నికల్లో హామీలతో నమ్మించి మోసం చేసిన ఆ పార్టీకి(Congress Party) పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని తెలిపారు. రాష్ట్రంలో, దేశంలో చెప్పుకొనేందుకు బీజేపీకు ఎజెండానే లేదన్న ఆయన, అందుకే మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టి గట్టెక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు.
BRS Focus on Lok Sabha Elections : ఎన్నికల సందర్భంగా అసలైన సమస్యలు చర్చకు రాకుండా ప్రజల దృష్టిని మరల్చే ఇలాంటి కుట్రలను క్షేత్రస్థాయిలో తిప్పి కొట్టాలని కేటీఆర్ సూచించారు. ప్రతి కార్యకర్త తానే అభ్యర్థిగా భావించి బీఆర్ఎస్ గెలుపు కోసం కదం తొక్కాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు సమష్టిగా పనిచేస్తామని, నాయకత్వం అప్పగించిన బాధ్యత నెరవేరుస్తామని నేతలంతా కేటీఆర్కు వాగ్ధానం చేశారు.