Hyderabad Has Highest Car Accidents in Last Two Years Compared to Metro Cities : ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య గణణీయంగా పెరుగుతోంది. ఈ ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోతుండగా, ఎందరో జీవితాంతం వైకల్యంతో బతకాల్సి వస్తుంది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాలతో పోలీస్తే గత రెండేళ్లలో హైదరాబాద్లోనే అత్యధిక కారు ప్రమాదాలు జరిగినట్లు ప్రముఖ వాహన బీమా సంస్థ వెల్లడించింది.
అకో ‘యాక్సిడెంట్ ఇండెక్స్-2024’ పేరుతో తాజాగా ఈ నివేదికను విడుదల చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా దేశ రాజధాని దిల్లీ, పుణె, బెంగళూరు, కోల్కతా, ముంబయి, చెన్నై, అహ్మదాబాద్ నగరాలున్నాయని పేర్కొంది. ఆ నివేదికలో పలు ప్రధానాంశాలను ప్రస్తావించింది.
దేశవ్యాప్తంగా 78% రోడ్డు ప్రమాదాలు మెట్రో నగరాల్లోనే జరుగుతున్నాయి : బెంగళూరు మహా నగరంలో 45% కారు ప్రమాదాలు జరుగుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది. రాజధాని నగరమైన దిల్లీలో 13% జరుగుతుండగా. ముంబయిలో 12% చోటుచేసుకుంటున్నాయి. ముంబయి లో ప్రమాదాలు గుంతల కారణంగా జరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది.
చెరువులోకి దూసుకెళ్లిన కారు - ఐదుగురు యువకులు మృతి
2022లో అత్యధిక కారు ప్రమాదాలతో దిల్లీ మొదటి స్థానంలో ఉండేది. కానీ ప్రస్తుతం అగ్రస్థానంలో హైదరాబాద్ నగరం ఉంది. దిల్లీతో పోల్చుకుంటే హైదరాబాద్లో 46% కార్లు తక్కువగా ఉన్నాయి. అయినప్పుటికీ గత రెండేళ్లలో భాగ్యనగరంలోనే ఎక్కువ ప్రమాదాలు జరిగాయి.
Miyapur is High Risk Area : హైదరాబాద్లో ప్రమాదాలకు ఎక్కువ ఆస్కారమున్న ప్రాంతంగా మియాపూర్ నిలిచింది. ఇది దేశవ్యాప్తంగా ఆరో స్థానంలో ఉంది. బెంగళూరులోని బొమ్మనహళ్లి, దిల్లీలోని నోయిడా, పుణెలోని మరుంజి, ముంబయిలోని మిరారోడ్, చెన్నైలోని మెడవక్కం ప్రాంతాలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.
జంతువుల కారణంగా జరిగే ప్రమాదాలను గమనిస్తే శునకాలతో 62%, ఆవులతో 29%, బర్రెలతో 4%, కోతులతో 3%, మేకలతో 1% చొప్పున జరుగుతున్నాయని నివేదిక తెలుపుతుంది. ఏదేమైనప్పటికి అతి వేగం, నిర్లక్ష్యం కారణంగా, ట్రాఫిక్ నియమాలు పాటించకుండా రోడ్డు ప్రమాదాలకు కారకులు కావద్దని నిపుణులు సూచిస్తున్నారు.