HMDA Started Double Decker Buses in Hyderabad : హైదరాబాద్లో డబుల్ డెక్కర్ బస్సులంటే గతంలో ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. తర్వాత అవి మూలకు చేరినా కొన్నేళ్ల కిందట కొత్త హంగులతో అందుబాటులోకి తీసుకొచ్చారు. నగరంలోని సుందర ప్రదేశాలను పర్యాటకులకు చూపించాలనే ఉద్దేశంలో 'జాయ్రైడ్' పేరుతో హెచ్ఎండీఏ వీటిని ప్రవేశపెట్టింది. వీటిల్లో ప్రయాణం ఉచితమే అయినా, ప్రచారం లేక ఆదరణ లేకుండా పోయింది. బస్సు ఎక్కడ మొదలవుతుంది? ఎక్కడ దిగాలనే విషయాలపై అవగాహన లేక ఎక్కువగా ఖాళీగానే చక్కర్లు కొడుతున్నాయి.
ఫారిన్ కాదు.. మన హైదరాబాదే.. త్వరలోనే డబుల్ డెక్కర్ బస్సుల రయ్ రయ్..
- డబుల్ డెక్కర్ బస్సులో డ్రైవర్తో 65 మంది కూర్చునే సీట్లు ఉంటాయి. పూర్తిస్థాయి ఏసీ సదుపాయం ఉంటుంది.
- హైటెక్ సిటీ, సాలార్జంగ్ మ్యూజియం, ట్యాంక్బండ్ వంటి పర్యాటక ప్రదేశాలను కలుపుతూ చక్కర్లు కొడతాయి.
- ట్యాంక్బండ్, నెక్లెస్రోడ్, బిర్లా మందిర్, చార్మినార్, మక్కా మసీద్, తారామతి బారాదరి, గోల్కొండ, గండిపేట పార్కు, దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జి, ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల వైపుగా వెళ్తాయి.
- పర్యాటకులు కోరితే 5 నిమిషాల పాటు బస్సు ఆపి ప్రదేశాలను చూడటానికి అవకాశం ఇస్తున్నట్లు డ్రైవర్లు తెలిపారు. సుమారు 12-15 కి.మీ ప్రయాణించొచ్చు.
- సైబర్ టవర్స్ నుంచి హైటెక్ సిటీని చుట్టేయడానికి మూడు బస్సులను కేటాయించారు. ఒక్కో సర్వీస్కి మధ్య సుమారు 15 నిమిషాల బ్రేక్ ఉంటుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రతి బస్సు రెండు ట్రిప్పులు తిరుగుతాయని అధికారులు చెబుతున్నారు.
- జేబీఎస్ నుంచి సాలార్జంగ్ మ్యూజియం వరకు మరో 3 బస్సులు మధ్యాహ్నం 2 వరకు నడుపుతారు. సాయంత్రం 4.30 నుంచి 8.30 వరకు ట్యాంక్బండ్ చుట్టూ తిరుగుతాయి. సంజీవయ్య పార్కు, లేక్ వ్యూ, అంబేడ్కర్ విగ్రహం, సచివాలయం, లుంబినీ పార్కు తదితర ప్రాంతాల్లో స్టాపులు ఉంటాయి.
అవి ఏర్పాటు చేస్తే సరి : హెచ్ఎండీఏ ఆరు బస్సులను ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం 3 బస్సులే కనిపిస్తున్నాయి. అవి బస్టాపుల్లో ఆపడం లేదని పర్యాటకులు వాపోతున్నారు. డబుల్ డెక్కర్ బస్సులు ఆగే ప్రదేశాల్లో ఎలాంటి సూచికలు ఏర్పాటు చేయలేదు. బస్సులపైన ఉచిత ప్రయాణమని బోర్డులు ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. ట్యాంక్బండ్ చుట్టూ తిరిగే ఈ బస్సులు కేవలం హుస్సేన్సాగర్ పరిసరాల్లోనే ఆగుతున్నాయి.
హైదరాబాద్లో తొలి డబుల్ డెక్కర్ కారిడార్ - నేడు సీఎం రేవంత్ శంకుస్థాపన